Rahul Gandhi: వయనాడ్ ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరిన రాహుల్ గాంధీ

ఈ విషాదం ఫలితంగా ఏర్పడిన విధ్వంసం ప్రత్యక్షంగా చూశాను. 200 మందికి పైగా మరణించారు. చాలా మంది తప్పిపోయారు

Update: 2024-08-07 17:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇంకా చాలామంది ఆచూకీ దొరకలేదు. వందల సంఖ్యలో మరణాల నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం లోక్‌సభలో మాట్లాడుతూ, ఈ ప్రమాదాన్ని 'జాతీయ విపత్తు'గా ప్రకటించాలని అభ్యర్థించారు. అలాగే, ప్రభావితమైన వారికి సమగ్ర పునరావాస ప్యాకేజీని అందించాలని, బాధితులకు ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 'వయనాడ్‌ని సందర్శించాను. ఈ విషాదం ఫలితంగా ఏర్పడిన విధ్వంసం ప్రత్యక్షంగా చూశాను. 200 మందికి పైగా మరణించారు. చాలా మంది తప్పిపోయారు, అయితే మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అంచనాలున్నాయి ' అని రాహుల్ గాంధీ చెప్పారు. చాలామంది బాధితుల్లో కుటుంబ సభ్యులను కోల్పోయి ఒంటరైనవారు ఉన్నారు. ఇదే సమయంలో వయనాడ్ ప్రాంతంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ప్రయత్నాల్లో పనిచేస్తున్న వివిధ శాఖల పనితీరును రాహుల్ గాంధీ ప్రశంసించారు. అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చి సహాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

Tags:    

Similar News