Raghav Chadha: ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ.. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా

రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సొంతంగా పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు.

Update: 2024-10-09 13:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సొంతంగా పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. ఒంటరిగా బీజేపీని ఓడించగల సామర్థ్యం ఆప్‌కు ఉందన్నారు. ఢిల్లీలో తమకు ఎలాంటి పొత్తు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే), పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), ఢిల్లీలో ఆప్ వంటి ప్రాంతీయ పార్టీలు తమంతట తాముగా బీజేపీని ఓడించగలవని తెలిపారు. బీజేపీతో ప్రత్యక్ష పోరులో కాంగ్రెస్‌ బలహీనంగా ఉండి గెలవలేక పోతోందని చెప్పారు. ఇలాంటి సమయంలో ఇండియా కూటమి పార్టీల మద్దతు లభిస్తే మరింత బలపడేదని, బీజేపీని సులభంగా ఓడించేదన్నారు. కానీ ఒంటరిగా వెళ్తే.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో వచ్చిన ఫలితాలే పునరావృతమయ్యే చాన్స్ ఉందని స్పష్టం చేశారు. అంతకుముందు ఆప్ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేయబోతుందని వ్యాఖ్యానించారు. కాగా, హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆప్ నేతలు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


Similar News