పంజాబీ కవి సుర్జిత్ పటార్ కన్నుమూత

ప్రముఖ పంజాబీ కవి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుర్జిట్ పటార్(79) కన్నుమూశారు. లుథియానాలో ఉన్న ఆయన నివాసంలో శనివారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Update: 2024-05-11 05:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ పంజాబీ కవి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుర్జిట్ పటార్(79) కన్నుమూశారు. లుథియానాలో ఉన్న ఆయన నివాసంలో శనివారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పటార్ మరణవార్తతో పంజాబ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా మృతి చెందడంతో సాహితీ ప్రియులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. ప్రఖ్యాత కవి, పంజాబీ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు గుర్భజన్ గిల్ మాట్లాడుతూ పటార్ మరణంతో శూన్యత ఏర్పడిందని, దానిని ఎవరూ పూరించలేరని తెలిపారు.

1945లో జలంధర్ జిల్లాలోని పతర్ కలాన్ గ్రామంలో జన్మించిన డాక్టర్ పటార్.. పాటియాలాలోని పంజాబ్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. అంతేగాక సాహిత్య రంగంలో ప్రత్యేక ముద్ర వేశారు. ఆయన రాసిన కవితలతో ప్రజల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్నారు. గాలిలో వ్రాసిన అక్షరాలు, పదాల గుడి, శరదృతువు హారము, నేలలో ట్యూన్, బ్రిఖ్ అర్జ్ కరే, వంటి కవితలు సామాన్య ప్రజల్లో ఆదరణ పొందాయి.

సాహిత్య రంగంలో పటార్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2012లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అలాగే ఆయనకు 1979లో పంజాబ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1993లో సాహిత్య అకాడమీ అవార్డు, 1999లో పంచానంద్ పురస్కారం, 2007లో ఆనంద్ కావ్య సమ్మాన్, 2009లో సరస్వతి సమ్మాన్, గంగాధర్ జాతీయ పద్య పురస్కారం లభించాయి. 2014లో కుసుమాగ్రజ్ లిటరరీ అవార్డు సైతం లభించింది. అయితే కేంద్ర తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు సుర్జిత్ మద్దతు తెలిపారు. చట్టాలను వెనక్కి తీసుకోకపోతే తన పద్మశ్రీని వెనక్కి ఇస్తానని ప్రకటించారు.

Tags:    

Similar News