ఆవిష్కరణల మోజులో అన్నీ మార్చకండి.. ప్రధాని మోడీ
‘ఆవిష్కరణల మోజులో అన్నీ మార్చకండి. కొన్ని విషయాలను అలాగే వదిలేయండి’ అని ప్రధాని మోడీ సూచించారు.
న్యూఢిల్లీ: ‘ఆవిష్కరణల మోజులో అన్నీ మార్చకండి. కొన్ని విషయాలను అలాగే వదిలేయండి’ అని ప్రధాని మోడీ సూచించారు. శతాబ్ధి ఉత్సవాలు జరుపుకుంటున్న ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోడీ శుక్రవారం ప్రసంగించారు. ఆవిష్కరణలపై దృష్టి సారించే విద్యార్థులు తమకు తాముగా రోడ్ మ్యాప్ను ఏర్పాటు చేసుకోవాలని, పకడ్బందీ వ్యూహంతో కృషి చేస్తేనే విజయం సాధ్యమని చెప్పారు.
‘ఈ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్లోని పటేల్ కేఫ్లో అందించే టీ, నూడుల్స్, సౌత్ క్యాంపస్లో అందించే మెమోస్ ఆఫ్ ఛాణక్య (తినుభండారం) రుచిని మార్చే ఆలోచన చేయకండి’ అని మోడీ చేసిన జోక్కు విద్యార్థులు పగలబడి నవ్వుతూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఈ స్టాల్స్ను వర్సిటీ విద్యార్థులతో పాటు ఇతరులు కూడా తరచూ సందర్శించి వాటి రుచిని ఆస్వాదిస్తుంటారు. ఢిల్లీ యూనివర్సిటీకి మెట్రోలో వచ్చిన ప్రధాని మార్గం మధ్యలో ప్రయాణికులు, విద్యార్థులతో ముచ్చటించారు.