ప్రధాని మోడీ నాలుగు రాష్ట్రాల సుడిగాలి పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రధాని మోడీ శుక్రవారం నుంచి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన జరపనున్నారు.
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ శుక్రవారం నుంచి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన జరపనున్నారు. రాయ్పూర్, గోరఖ్పూర్, వారణాసి, వరంగల్, బికనీర్ నగరాల్లో డజను కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రూ.50 వేల కోట్ల విలువైన 50 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం, శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 7వ తేదీన ఢిల్లీ నుంచి రాయ్పూర్ వెళ్లి బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అందులో రాయ్పూర్-విశాఖపట్నం కారిడార్లోని 6 లేన్ల రోడ్డుకు శంకుస్థాపన కూడా ఉంది.
ఈ సందర్భంగా ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత గోరఖ్పూర్ వెళ్లనున్న మోడీ అక్కడి గీతా ప్రెస్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మూడు వందే భారత్ రైళ్లకు జెండా ఊపి గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు. గోరఖ్పూర్ నుంచి తన నియోజక వర్గమైన వారణాసికి మోడీ వెళ్తారు. అక్కడ పలు కీలక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. వారణాసి-జాన్పూర్ జాతీయ రహదారి (ఎన్హెచ్-56) నాలుగు లేన్ల విస్తరణను జాతికి అంకితం చేస్తారు. మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ పునరుద్ధరణకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
వరంగల్ సభలో ప్రసంగం..
వారణాసి నుంచి 8వ తేదీన తెలంగాణలోని వరంగల్కు ప్రధాని వెళ్తారు. అక్కడ నాగ్పూర్-విజయవాడ కారిడార్లోని కీలక విభాగాలతో సహా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. జాతీయ రహదారి-563లో కరీంనగర్-వరంగల్ మధ్య నాలుగు లేన్లకు శంకుస్థాపన చేస్తారు. వరంగల్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వరంగల్ నుంచి బికనీర్ వెళ్లనున్న ప్రధాని అక్కడ బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అమృత్సర్-జామ్నగర్ ఎక్స్ప్రెస్ వే లోని వివిధ విభాగాలను ఆయన అంకితం చేస్తారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-1 కోసం ఇంటర్-స్టేట్ ట్రాన్స్మిషన్ లైన్ను కూడా ప్రధానమంత్రి అంకితం చేస్తారు. బికనీర్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. తర్వాత బికనీర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.