విజన్ డాక్యుమెంట్‌పై మోడీ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం

'2024, మేలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు, తక్షణ చర్యలపై చర్చించారని' ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Update: 2024-03-03 14:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వికసిత్ భారత్-2047 కోసం విజన్ డాక్యుమెంట్, రాబోయే 5 ఏళ్ల కోసం వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికపై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమైనట్టు ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి. ఈ సమావేశంలో, కౌన్సిల్ 100 రోజుల ఎజెండాను రూపొందించింది. '2024, మేలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు, తక్షణ చర్యలపై చర్చించారని' ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోడీ, 'విజన్ డాక్యుమెంట్ ప్రజల్లో సాధికారత కల్పించడం, స్థిరమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించడంపై ఆధారపడి ఉంటుంది. 25 ఏళ్ల ప్రణాళికలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లో ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది. వికసిత్ భారత్ సెమినార్‌లను ప్రతి శాఖ ఎజెండాలో చేర్చాలని, ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని' తెలిపారు. సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్), ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) వంటి వ్యాపార సంస్థలు కూడా దీనిపై చర్చలు ప్రారంభించాలని మోడీ కోరారు.

2 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పాటు తీవ్రంగా శ్రమించిన అనంతరం, వికసిత్ భారత్ కోసం రోడ్‌మ్యాప్‌లో రాష్ట్రాలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక సంస్థలు, పౌర సమాజం, వైజ్ఞానిక సంస్థల ఆలోచనలు, సూచనలు, ఇన్‌పుట్‌ల కోసం యువతను సమీకరించడం ద్వారా విస్తృత సంప్రదింపులు జరిగాయి. వివిధ స్థాయిల్లో 2,700కు పైగా సమావేశాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు నిర్వహించిన తర్వాత విజన్ డాక్యుమెంట్ రూపొందించబడింది. 20 లక్షల మందికి పైగా యువత నుంచి సూచనలు అందాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Tags:    

Similar News