ముంబై : 350 ఏళ్ల క్రితం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉపయోగించిన వాఘ్ నఖ్ (పులి గోళ్లు)ను లండన్ నుంచి భారత్కు తీసుకురానున్నారు. దీనికి సంబంధించి లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంతో కుదిరిన ఒప్పందంపై మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ మంగళవారం సంతకాలు చేయనున్నారు. నవంబరు నాటికి శివాజీ వాఘ్ నఖ్లు భారత్కు చేరుకోనున్నాయని మహారాష్ట్ర అధికార వర్గాలు తెలిపాయి.
బీజాపూర్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్ను ఛత్రపతి శివాజీ మహారాజ్ ఓడించిన రోజునే దాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియంలో వాఘ్ నఖ్ను ప్రదర్శనకు ఉంచుతామన్నారు. దేశంలోని మరో నాలుగు ప్రాంతాల్లోనూ ఈ ఆయుధాన్ని ప్రదర్శనకు ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టు మ్యూజియం వర్గాలు పేర్కొన్నాయి.