అస్సాంలో ముస్లిం జనాభా పెరుగుదల ఆందోళనగా ఉంది: సీఎం హిమంత బిశ్వ శర్మ

ఇది తనకు అతిపెద్ద సమస్య. ముస్లిం జనాభా గణనీయంగా పెరిగింది. జనాభా పెరగడమనేది తనకు రాజకీయం కాదని, జీవన్మరణ సమస్య అన్నారు

Update: 2024-07-17 14:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రంలో ముస్లిం జనాభా పెరుగుదలపై అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. 'రాష్ట్రంలో మారుతున్న జనాభా నిష్పత్తి పట్ల తనకు ఆందోళనగా ఉంది. ఇది తనకు అతిపెద్ద సమస్య. ముస్లిం జనాభా గణనీయంగా పెరిగింది. జనాభా పెరగడమనేది తనకు రాజకీయం కాదని, జీవన్మరణ సమస్య' అని తెలిపారు. 1951లో 12 శాతం ఉన్న ముస్లిం జనాభా ప్రస్తుతం 40 శాతానికి చేరుకుంది. మేము అనేక జిల్లాలను కోల్పోయాము. కాబట్టి ఇది రాజకీయ సమస్య కాదని, జీవన్మరణ సమస్య అన్నారు. కాగా, హిమంత బిశ్వ శర్మ గతంలోనూ ఈ అంశంపై బహిరంగ ప్రకటనలు చేశారు. 2021, జూన్‌లో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలోనూ.. అస్సాంలో మైనారిటీ ముస్లింలలో ఉన్న ఆర్థిక అసమానతలు, పేదరికం వల్లనే జనాభా అధికంగా ఉందన్నారు. రాష్ట్రంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నియంత్రణపై అవగాహన కల్పించడానికి ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లోనూ ముస్లిం ప్రాబల్యం ఉన్న ధుబ్రీ నియోజకవర్గంలో బీజేపీ గెలవాలని అనుకోవడంలేదని ప్రచారం సందర్భంగా మాట్లాడారు. అస్సాంను ఆనుకుని ఉండే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 


Similar News