Assam: ఆధార్ కార్డు కావాలంటే ఎన్ఆర్సీ దరఖాస్తు నంబర్ తప్పనిసరి

ఆధార్‌ కార్డుల జారీపై అసోం(Assam) ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకురానుంది.

Update: 2024-09-08 04:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆధార్‌ కార్డుల జారీపై అసోం(Assam) ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకురానుంది. ఆధార్‌ కార్డు కావాలంటే జాతీయ పౌర పట్టిక(NRC) కోసం దరఖాస్తు చేసుకున్న నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుందని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. అక్టోబర్‌ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని హిమంత బిశ్వశర్మ(Assam Chief Minister Himanta Biswa Sarma) తెలిపారు. అసోంలోకి అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగా ఆధార్‌ కార్డుల జారీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర జనాభా కంటే ఆధార్‌ కార్డు దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ముఖ్యంగా నాలుగు జిల్లాల్లో ఆధార్ దరఖాస్తుల సంఖ్య జనాభా కన్నా అధికంగా ఉన్నట్లు తెలిపారు. అనుమానిత వ్యక్తులు ఇందులో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. అందుకే ఎన్‌ఆర్‌సీ దరఖాస్తు రసీదు నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

అసోంలోకి అక్రమ ప్రవేశాలు

అసోంలోకి అక్రమ ప్రవేశాలు అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు హిమంత పేర్కొన్నారు. అసోంలో ఆధార్‌ కార్డుల జారీ ఇక ఎంతమాత్రం సులభం కాదని తెలిపారు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే పద్ధతి అవలంబించాలని కోరారు. బంగ్లాదేశ్‌ వంటి పొరుగుదేశాల నుంచి అక్రమ వలసలు పెరుగుతున్నాయని, వారిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు చెప్పారు. ఈ రెండు నెలల్లో పలువురిని ఆ దేశ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. అందుకే తాము కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపారు.


Similar News