ఎన్డీఏ ఏకైక లక్ష్యం ‘నేషన్ ఫస్ట్’..ప్రధాని నరేంద్ర మోడీ

ఎన్డీయే ఏకైక లక్ష్యం నేషన్‌ఫస్ట్‌గా ఉన్నందున దేశ ప్రజలు మరోసారి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అవినీతి నిర్మూలనకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపారు.

Update: 2024-07-02 14:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్డీయే ఏకైక లక్ష్యం నేషన్‌ఫస్ట్‌గా ఉన్నందున దేశ ప్రజలు మరోసారి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అవినీతి నిర్మూలనకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపారు. గత పదేళ్లలో దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశామని, మూడో దఫా పాలనలో మూడింతల వేగంతో పని చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదులు తెలిపే చర్చ సందర్భంగా లోక్ సభలో మోడీ మంగళవారం ప్రసంగించారు. దేశ ప్రజలు మా పనితీరును పరీక్షించినన తర్వాతే వరుసగా మూడోసారి సేవ చేసే అవకాశం ఇచ్చారని కొనియాడారు. దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. విశ్వ వ్యాప్తంగా భారత్ బలం పెరుగుతోందని నొక్కి చెప్పారు. దేశం చాలా రోజులుగా ఆలోచనలతో ముందుకు సాగుతోందని వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2014 కన్నా ముందు దేశం అవినీతితో సతమతమైందన్నారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని తేల్చి చెప్పారు. పదేళ్లలో 25కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ 26శాతం మాత్రమే

మోడీ తన ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం 99సీట్లు మాత్రమే వచ్చాయని, వారి స్ట్రైక్ రేట్ 26శాతంగా ఉందన్నారు. మిత్ర పక్షాలతో పొత్తు పెట్టుకోకుంటే వారికి ఆ సీట్లు కూడా వచ్చి ఉండేవి కాదని ఎద్దేవా చేశారు. గత మూడే టర్ము్ల్లో కాంగ్రెస్ వంద సీట్లు మార్కును దాటలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ తన ఓటమిని అంగీకరించి, ప్రజల ఆదేశాన్ని గౌరవించి ఉంటే బాగుండేదన్నారు. కానీ వారు దేశంలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అరాచకాన్ని వ్యాప్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే రాజ్యాంగంపై కూడా నిరంతరం అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. హిందువులపై దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారని..వాటిని ఏ మాత్రం సహించబోమని హెచ్చరించారు. ఎన్ని అబద్దాలు చెప్పినా ఎన్నికల్లో మాత్రం ఓటమి తప్పలేదని విమర్శించారు.

అడ్డుకున్న ప్రతిపక్షాలు

ప్రధాని ప్రసంగం సందర్భంగా ప్రతిపక్షాలు నినాదాలు చేశాయి. దేశంలో నియంతృత్వ పాలన నడుస్తోందని, ఇది సరైంది కాదని తెలిపాయి. అలాగే తీవ్ర అల్లర్లు చోటు చేసుకున్న మణిపూర్ అంశంపై మాట్లాడాలని , అక్కడి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రధాని తన ప్రసంగాన్ని రెండు సార్లు ఆపి వేశారు. స్పీకర్ పలుమార్లు ప్రతిపక్ష సభ్యులను వారించినప్పటికీ వారు నినాదాలు చేశారు. ఈ ఘర్షణ మధ్యనే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. మోడీ సుమారు 2గంటలకు పైగా మాట్లాడారు.

లోక్ సభ నిరవధిక వాయిదా

లోక్ సభ షెడ్యూల్ కన్నా ఒక రోజు ముందు గానే వాయిదా పడింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ మాట్లాడిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. కాగా, పార్లమెంట్ సమావేశాలు జూన్ 24న ప్రారంభమయ్యాయి. అయితే మొదట జూలై 3వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఒక రోజు ముందే సమావేశాలు ముగియడం గమనార్హం. చివరి రోజు మోడీ ప్రసంగం తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సభ తీర్మానం చేసింది. అనంతరం సభ వాయిదా పడింది. 

Similar News