Haryana: అక్టోబర్ 15న కొలువుదీరనున్న హర్యానా ప్రభుత్వం
హర్యానా(Haryana)లో అక్టోబర్ 15న కొత్త ప్రభుత్వం కొలవుదీరనుంది. ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా(Haryana)లో అక్టోబర్ 15న కొత్త ప్రభుత్వం కొలవుదీరనుంది. హర్యానా ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పంచకుల డిప్యూటీ కమిషనర్ అధ్యక్షతన 10 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంచకుల అదనపు డిప్యూటీ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ కూడా సభ్యులుగా ఉంటారని సీఎస్ టీవీఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వుల్లో తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు మరికొందరు మంత్రులు కూడా ఆరోజే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం.
సీఎంగా నయాబ్ సింగ్ సైనీ..
ఇకపోతే, ఈ ఏడాది మార్చిలో మనోహర్ లాల్ ఖట్టర్ను తప్పించి నయాబ్ సింగ్ సైనీని సీఎంగా ఎంపిక చేశారు. అయితే, బీసీ నేత నయాబ్ సింగ్ సైనీనే సీఎంగా ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయి. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీ 48 సీట్లు గెలుచుకుంది. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్తో సహా ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాషాయ పార్టీకే మద్దతు ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 37 సీట్లు గెలుచుకోగా, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ రెండు సీట్లు గెలుచుకుంది.