స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా.. అక్కడ జాతీయ జెండా రెపరెపలు

దిశ, నేషనల్ బ్యూరో : మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలుగా గడిచిపోయాయి.

Update: 2024-02-19 17:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలుగా గడిచిపోయాయి. అయినా ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతం సుక్మాలో ఉన్న మారుమూల గ్రామం పువర్తిలో భారత జాతీయ జెండా ఎగరలేదు. తాజాగా సోమవారం రోజు పువర్తి గ్రామంలో కొత్త చరిత్ర మొదలైంది. భారత భూమి సాక్షిగా ఆ ఊరిలో మొట్టమొదటిసారిగా మన మువ్వన్నెల జెండాను భద్రతా బలగాలు ఆవిష్కరించాయి. దీంతో స్థానికులు సంబురాలు చేసుకున్నారు. ఈ ఊరిలో మావోయిస్టులు కూరగాయలను పండించేందుకు గతంలో వాడిన భూమిని పోలీసులు ఈసందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. ఒకప్పుడు పువర్తి గ్రామాన్ని మావోయిస్టులు శిక్షణా శిబిరాలకు వేదికగా వాడుకునే వారు. అక్కడే కీలక సమావేశాలు నిర్వహించుకునేవారు. ఇటీవల ఈ గ్రామంలో భద్రతా దళాల క్యాంపును ఏర్పాటు చేశారు. దీంతో ఈ ఊరి నుంచి కార్యకలాపాలు నిర్వహించడం మావోయిస్టులకు పెద్ద సవాల్‌గా మారిపోయింది. మావోయిస్టుల కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ప్రభుత్వ పథకాలన్నీ అందేలా చూస్తామని పువర్తి గ్రామ ప్రజలకు అధికారులు హామీ ఇచ్చారు. కాగా, ఇటీవల టేకల్ గూడ పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేయడంతో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. దానికి ప్రతిగానే పువర్తి గ్రామంలో పోలీసులు నిఘా పెంచినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News