Mumbai rains: ముంబైలో భారీ వర్షాలు.. నలుగురు మృతి

ముంబైలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షాల వల్ల నలుగురు మరణించినట్టు అధికారులు తెలిపారు.

Update: 2024-09-26 06:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలో భారీ వర్షాలు ముంచెత్తాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షాల వల్ల వివిధ ఘటనల్లో నలుగురు మరణించినట్టు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో 275 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు. వర్షాల కారణంగా ముంబైలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అలాగే పలు రైల్వే సేవలు సైతం కాసేపు అధికారులు నిలిపివేశారు. గోవండి, మన్‌ఖుర్ద్ మధ్య వరద తగ్గిన తర్వాత లోకల్ రైళ్లను తిరిగి ప్రారంభించారు. అంధేరి, కుర్లా ఈస్ట్, నెహ్రూ నగర్, చెంబూర్‌తో సహా పలు ప్రాంతాలు కుండపోత వర్షాల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా ముంబై విమానాశ్రయం నుంచి 14 విమానాలను దారి మళ్లించారు. పలు విమానాల ల్యాండింగ్‌కు అనుమతి రద్దు చేశారు. బుధవారం రాత్రి ముంబ్రా బైపాస్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే భారీ వర్షాలు కొనసాగే చాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరించింది.  


Similar News