Jharkhand Elections: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంఎస్ ధోని
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్గా నియామకం అయ్యాడు.
దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్గా నియామకం అయ్యాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎస్ ధోనీ ఫోటోను వాడుకునేందుకు ఎన్నికల కమిషన్ అనుమతిచ్చిందని జార్ఖండ్ ఎన్నికల అధికారి కె. రవికుమార్ వెల్లడించారు ‘‘తన ఫోటోను ఉపయోగించుకోవడానికి ఎన్నికల కమిషన్కు మహేంద్ర సింగ్ ధోనీ అంగీకారం తెలిపారు. ఇతర వివరాల కోసం మేం ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నాం. మహేంద్ర సింగ్ ధోని ఓటర్ల సమీకరణకు కృషి చేస్తారు’’ అని రవికుమార్ మీడియాతో తెలిపారు.
స్వీప్ కార్యక్రమం
స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన పెంచేందుకు ధోనీ కృషి చేయనున్నారు. ముఖ్యంగా భారీగా పోలింగ్ జరిగేలా.. అధిక సంఖ్యలో ఓట్లు పోలయ్యేలా ఉత్సాహాన్ని పెంచేందుకు ధోనీ అభ్యర్థనలను, ప్రజాదరణను వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇకపోతే, జార్ఖండ్ అసెంబ్లీలోని 81 స్థానాలకు రెండుదశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 13 తొలిదశ, నవంబర్ 20న రెండోదశ పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 23న ఫలితాలు రానున్నాయి.