పేపర్ లీక్‌లు ఆపడం మోడీకి ఇష్టం లేదు: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ విమర్శలు

యూజీసీ-నెట్ పరీక్ష రద్దు, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.

Update: 2024-06-20 10:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: యూజీసీ-నెట్ పరీక్ష రద్దు, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. పేపర్ లీకేజీలను ఆపడం మోడీకి ఇష్టం లేదని తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సమయంలో, వేలాది మంది పేపర్ లీక్‌ల గురించి ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. ‘రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాలను ప్రధాని ఫోన్ చేసి ఆపినట్లు వార్తలు వచ్చాయి. కానీ దేశంలో మాత్రం పేపర్ లీక్ లను ఆపలేకపోతున్నారు’ అని వ్యాఖ్యానించారు.

ఈ ఘటనలను నియంత్రిచలేకపోతున్నారా లేక ఆపడానికి ఇష్టపడటం లేదా అని ప్రశ్నించారు. ‘పేపర్ లీక్‌ల వెనుక కారణం విద్యావ్యవస్థను బీజేపీ మాతృ సంస్థ స్వాధీనం చేసుకుంది. ఇది తిరిగి రాలేనంతవరకు పేపర్ లీకేజీలు జరుగుతూనే ఉంటాయి. మోడీ ఈ కబ్జాను సులభతరం చేశారు. ఇది దేశ వ్యతిరేక చర్య’ అని అన్నారు. యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లను కూడా మోడీ మెరిట్ ఆధారంగా నియమించలేకపోయారని ఆరోపించారు. విద్యావ్యవస్థను మొత్తం బీజేపీ నాశనం చేసిందన్నారు. పరీక్షల లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Similar News