Manipur video case: మణిపూర్‌లో 'లా అండ్ ఆర్డర్' లేదు.. పోలీసులపై సుప్రీంకోర్టు సీరియస్

మణిపూర్ హింసకు సంబంధించి 6,523 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైతే, ఏడుగురినే అరెస్టు చేస్తారా అని ఆ రాష్ట్ర పోలీసులను సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Update: 2023-08-01 13:27 GMT

న్యూఢిల్లీ : మణిపూర్ హింసకు సంబంధించి 6,523 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైతే, ఏడుగురినే అరెస్టు చేస్తారా అని ఆ రాష్ట్ర పోలీసులను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గత రెండు నెలలుగా మణిపూర్‌లో శాంతి భద్రతలే లేవని.. అక్కడి రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోయిందని వ్యాఖ్యానించింది. మణిపూర్ వైరల్ వీడియో కేసులో రెండోరోజు (మంగళవారం) వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. "పౌరులకు రక్షణ కల్పించకపోతే పోలీసు శాఖ ఉండి కూడా ఏం ప్రయోజనం..? అల్లరి మూకకు ఆ ఇద్దరు మహిళలను అప్పగించిన వారిని (పోలీసులను) రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు పిలిపించి ప్రశ్నించారా ? లేదా ?" అని ఆక్షేపించింది.

కేసులను దర్యాప్తు చేసే సామర్థ్యమూ మణిపూర్ పోలీసుల్లో కనిపించడం లేదని సుప్రీం బెంచ్ పేర్కొంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందని గుర్తు చేసింది. మణిపూర్ హింసాకాండకు సంబంధించిన మొత్తం 6,523 ఎఫ్‌ఐఆర్‌లలో ఎంతమంది నిందితులు ఉన్నారు..? వారి అరెస్టుకు తీసుకున్న చర్యలేంటి..? అనే విషయాలను తాము తెలుసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది.

వీటిపై పూర్తి వివరాలతో రాష్ట్ర డీజీపీ వ్యక్తిగతంగా సోమవారం రోజు (ఆగస్టు 7న) కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. మణిపూర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లన్నీ తప్పుల తడకగా ఉన్నాయని సుప్రీం మండిపడింది. భారీ స్థాయిలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల గురించి ప్రస్తావిస్తూ.. దర్యాప్తునకు మౌలిక వసతులు ఏమేరకు ఉన్నాయని సీబీఐని కూడా సుప్రీం కోర్టు అడిగింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదన వినిపిస్తూ.. మణిపూర్ కేసుల దర్యాప్తులో ఎలాంటి జాప్యం జరగకుండా చూసుకుంటామని, 11 ఎఫ్‌ఐఆర్‌లను సీబీఐకి బదిలీ చేసేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు.

కేసులను విభజించండి..

ఈ సందర్భంగా మణిపూర్ పోలీసులకు సుప్రీంకోర్టు పలు ఆదేశాలు ఇచ్చింది. మొత్తం 6500 కేసులను వాటి తీవ్రత ఆధారంగా విభజించాలని, హత్య, దాడి, రేప్, మహిళలపై హింస, చిన్నారులపై హింస వంటి అత్యంత తీవ్రమైన కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. కేసుల దర్యాప్తును ఫాస్ట్ ట్రాక్ చేయాలని స్పష్టం చేసింది. ‘‘మే 4 నుంచి జులై 7 వరకు పోలీసులు అసలు డ్యూటీ చేయలేదు. వారికి వారి బాధ్యతల పట్ల నిర్లక్ష్యమో, లేక వారు అసమర్ధులు కావడమో, లేక వారికి ఈ కేసులు దర్యాప్తు చేయడం ఇష్టం లేకపోవడమో.. అందుకు కారణం కావచ్చు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

మ‌ణిపూర్‌లో న‌మోదైన కేసుల‌ ద‌ర్యాప్తునకు ప్రత్యేక మెకానిజం అవ‌స‌రమని ధర్మాసనం అభిప్రాయపడింది. 6500 ఎఫ్ఐఆర్‌లపై సీబీఐ విచార‌ణ చేప‌ట్టడం అసాధ్యమే అనిపిస్తోంద‌ని కామెంట్ చేసింది. ప్రభుత్వ చ‌ర్యలు, విచార‌ణ తీరుపై నిఘా పెట్టేందుకు మాజీ జ‌డ్జీల‌తో క‌మిటీని ఏర్పాటు చేయాల‌నుకుంటున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్‌కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Tags:    

Similar News