ఇలాంటి డ్రెస్సింగా?.. మహిళపై యాసిడ్ దాడి బెదిరింపు

బెంగళూరులో ఓ మహిళపై యాసిడ్ దాడి బెదిరింపులకు పాల్పడిన నిందితుడిపై కేసు నమోదైంది. ఆ మహిళ దుస్తుల ఎంపికపై నిందితుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు.

Update: 2024-10-11 14:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరులో ఓ మహిళపై యాసిడ్ దాడి బెదిరింపులకు పాల్పడిన నిందితుడిపై కేసు నమోదైంది. ఆ మహిళ దుస్తుల ఎంపికపై నిందితుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. కర్ణాటకలో సరైన డ్రెస్‌లు ధరించాలని, లేదంటే ఆమెపై యాసిడ్ దాడి చేస్తానని ఆమె భర్తకు మెస్సేజ్ చేశాడు. నిందితుడి మెస్సేజీని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కర్ణాటక పోలీసులకు ట్యాగ్ చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు.

బెంగళూరులో ఇతియోస్ కంపెనీలో నిఖిత్ శెట్టి ఉద్యోగం చేస్తున్నాడు. జర్నలిస్టు షెహబాజ్ అన్సారీ భార్య ఖ్యాతిశ్రీపై నిఖిత్ శెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. కర్ణాటకలో సరైన డ్రెస్‌లు ధరించాలని, ఖ్యాతి శ్రీ సరైన దుస్తులు ధరించకుంటే ఆమెపై యాసిడ్ దాడి చేస్తానని షెహబాజ్ అన్సారీకి మెస్సేజీ పెట్టాడు. ఇదే మెస్సేజీ స్క్రీన్‌షాట్‌ను అన్సారీ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పోలీసులను ట్యాగ్ చేసి.. తన భార్యకు ఏమీ జరగకుండా ఉండటానికి ముందుగానే నిఖిత్ శెట్టిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా ద్వారా నిఖిత్ శెట్టి పని చేస్తున్న కంపెనీని కనిపెట్టి.. ఆ కంపెనీ హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ అన్సారీ మరో పోస్టు పెట్టాడు. ‘హలో ఇతియోస్ సర్వీసెస్. మీ ఉద్యోగి నా భార్యపై యాసిడ్ దాడి చేస్తానని బెదిరిస్తున్నాడు. కర్ణాటక పోలీసులకు ఇది వరకే ఫిర్యాదు చేశాను. మీ కంపెనీలో మహిళా ఉద్యోగులకు భద్రత కోసం ఈ యువకుడిపై నజర్ పెట్టండి. మీ ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యతనిస్తే దయచేసి ఆయనపై యాక్షన్ తీసుకోండి’ అని అన్సారీ పోస్టు చేశారు. కంపెనీ కూడా వెంటనే స్పందిస్తూ.. నిఖిత్ శెట్టిని ఉద్యోగంలో నుంచి తొలగించింది. ఈ విషయాన్ని కంపెనీ సోషల్ మీడియాలోనూ వెల్లడించింది. ఇలాంటి నడవడికను తాము అంగీకరించబోమని, తమ కంపెనీ విలువలకు ఇవి విరుద్ధమని పేర్కొంది. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు చెబుతూ అన్సారీ మరో పోస్టు పెట్టాడు.

Tags:    

Similar News