చివరి దశకు మహా కుంభమేళా.. ఇప్పటివరకు ఎంతమంది పుణ్యస్నానాలు ఆచరించారంటే?

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా (Kumbh Mela) జరుగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2025-02-22 10:13 GMT
చివరి దశకు మహా కుంభమేళా.. ఇప్పటివరకు ఎంతమంది పుణ్యస్నానాలు ఆచరించారంటే?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా (Kumbh Mela) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మహా వేడుకకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో (Triveni Sangam) పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 13న కుంభమేళా ప్రారంభమైన రోజు నుంచి ఫిబ్రవరి 21 వరకు మొత్తం 60 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహా కుంభమేళా భారతీయ సంస్కృతికి గొప్ప గుర్తింపని, ఈ మహోత్సవాన్ని ప్రపంచం మొత్తం గౌరవిస్తున్నదని యోగి అన్నారు. కుంభమేళా వేడుకను యావత్తు ప్రపంచం కీర్తిస్తోంటే.. రాష్ట్ర సామర్థ్యం, అభివృద్ధిపై నమ్మకం లేనివారు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మహాశివరాత్రి లోపు 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని ముందు అనుకున్నామని.. కానీ దానికి ముందే అంచనాలకు మించి భక్తులు హాజరయ్యారని అన్నారు.

కాగా, ప్రతీ 12 ఏళ్లకు ఓసారి నిర్వహించే ఈ మహా కుంభమేళా పుష్య పౌర్ణమి జనవరి 13న ప్రారంభమై.. ఫిబ్రవరి 26 మహా శివరాత్రి రోజు ముగియనుంది. తొలుత మొత్తం 40 నుంచి 45 కోట్ల మంది రావచ్చని అధికారులు అంచనా వేశారు. కానీ, ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం సరాసరి కోటిన్నర మంది వరకు వస్తున్నారు. జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరో నాలుగు రోజుల్లో ముగియనుండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. 

Tags:    

Similar News