పోలీసులు లంచం ఇవ్వడానికి చూశారు.. వైద్యురాలి తల్లిదండ్రుల సంచలన ఆరోపణ

కోల్‌కతా‌ వైద్యురాలి హత్యాచార ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే

Update: 2024-09-05 04:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా‌ వైద్యురాలి హత్యాచార ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసును సీబీఐ నిశితంగా దర్యాప్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో బాధితురాలు తల్లిదండ్రులు పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసు దర్యాప్తులో వారు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. కేసును మూసివేసేందుకు మాకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు.

బుధవారం రాత్రి జూనియర్ వైద్యులతో కలిసి ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ వద్ద నిరసనలో పాల్గొని తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, పోలీసులు మొదటి నుంచి సమగ్ర దర్యాప్తు లేకుండా కేసును మూసివేయడానికి ప్రయత్నించారు, మృతదేహాన్ని మొదట చూడటానికి మమ్మల్ని అనుతించలేదు, పోస్ట్‌మార్టం పరీక్షల కోసం మృతదేహాన్ని తీసుకెళుతున్నప్పుడు పోలీసు స్టేషన్‌లో వేచి ఉన్నాం, తరువాత, మృతదేహాన్ని మాకు అప్పగించినప్పుడు, ఒక సీనియర్ పోలీసు అధికారి మాకు డబ్బులను ఆఫర్ చేయగా, మేము దానిని తిరస్కరించాము. హడావుడిగా దహనసంస్కారాలు పూర్తిచేయించారని వారు తెలిపారు.

ఇదిలా ఉంటే, ఘటన జరిగినప్పటి నుంచి ఈ కేసులో పోలీసులుపై పలు విమర్శలు వస్తూనే ఉన్నాయి. దీంతో కోల్‌కతా హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. మరోవైపు బాధితురాలికి సంఘీభావంగా బుధవారం రాత్రి జూనియర్ వైద్యుల ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ వద్ద నిరసన చేపట్టారు. లైట్లన్ని ఆర్పేసి కొవ్వొత్తులు, కాగడాలు, సెల్‌ఫోన్‌ లైట్లతో భారీ ర్యాలీ చేపట్టారు. వీరితో పాటు గవర్నర్ సీవీ ఆనంద బోస్ సైతం మద్దతుగా రాజ్‌భవన్‌లో లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులతో వీధుల్లోకి వచ్చారు.


Similar News