Wayanad Floods: వాయనాడ్‌ బాధితుల కోసం 100 ఇళ్లను నిర్మించనున్న కర్ణాటక ప్రభుత్వం

కేరళకు సంఘీభావం తెలుపుతున్నట్టు సిద్ధరామయ్య ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Update: 2024-08-04 19:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారీ వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడి సర్వం కోల్పోయిన వయనాడ్ బాధితులకు కర్ణాటక ప్రభుత్వం అండగా నిలిచింది. వయనాడ్ బాధితులకు తమ ప్రభుత్వం 100 ఇళ్లను నిర్మించి ఇస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ సందర్భంగా వయనాడ్ విషాదంపై కేరళకు సంఘీభావం తెలుపుతున్నట్టు సిద్ధరామయ్య ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 'కేరళ సీఎం పినరయ్ విజయన్‌కు మా తరపున మద్దతుకు హామీ ఇస్తున్నాం. బాధితులకు 100 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించాం. కేరళ ప్రభుత్వంతో కలిసి పునర్నిర్మాణానికి పనిచేస్తామని ' ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ.. వయనాడ్‌కు ఎదురైన కస్ట సమయంలో మద్దతు ఇచ్చినందుకు కర్ణాటక ప్రజలకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు గురువారం రోజున రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ వయనాడ్‌లోని చూరల్‌మల కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించారు. జూలై 30న కేవలం గంటల వ్యవధిలో వాయనాడ్ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో 215 మంది మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 300 మంది వ్యక్తులు తప్పిపోయినట్లు అనుమానిస్తున్నారు. 

Tags:    

Similar News