కర్ణాటక కేబినెట్ తుగ్లక్ దర్బార్‌లా మారింది..ప్రభుత్వంపై బీజేపీ ఫైర్

ప్రయివేటు సంస్థల్లో కన్నడిగులకు 100శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లుపై కర్ణాటక ప్రభుత్వం యూ-టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్‌పై బీజేపీ ఫైర్ అయింది.

Update: 2024-07-18 13:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రయివేటు సంస్థల్లో కన్నడిగులకు 100శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లుపై కర్ణాటక ప్రభుత్వం యూ-టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్‌పై బీజేపీ ఫైర్ అయింది. కాంగ్రెస్ పాలన మహమ్మద్ బిన్ తుగ్లక్‌ పాలనను తలపిస్తోందని విమర్శించింది. మంత్రివర్గం మొత్తం తుగ్లక్ దర్బార్‌లా మారిందని మండిపడింది. బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినందున దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివరణ ఇవ్వాలని బీజేపీ నాయకుడు, ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ అన్నారు. గురువారం ఆయన రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. ‘కన్నడిగులకు 100శాతం రిజర్వేషన్లు కల్పించాలని మొదట్లో కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అదే పోస్ట్‌ను తొలగించారు. అనంతరం అలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదని మరోసారి వెల్లడించారు. ఈ వ్యవహారం చూస్తుంటే తుగ్లక్ పాలనే గుర్తుకొస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఒక వేళ బిల్లు పెట్టడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

అశోక్‌ వ్యాఖ్యలపై సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. ముసాయిదా బిల్లు ఇంకా తయారీ దశలోనే ఉందని, ఈ అంశంపై చర్చ జరుగుతోందని తెలిపారు. ‘ఇక్కడ తుగ్లక్ పరిపాలన లేదు. రాష్ట్రంలో సిద్ధరామయ్య పరిపాలన ఉంది. రిజర్వేషన్ అంశంపై డిస్కషన్స్ జరుగుతున్నాయి’ అని చెప్పారు. దీనిపై సమగ్ర చర్చ జరగాల్సి ఉందని, అందుకే కొంత గందరగోళం ఏర్పడిందని స్పష్టం చేశారు. తదుపరి కేబినెట్ సమావేశంలో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని తేల్చిచెప్పారు.

Tags:    

Similar News