PM: జల్ సంచయ్ జన్ భగీదారీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోడీ

ప్రధాని మోడీ శుక్రవారం గుజరాత్‌లో కొత్తగా ‘జల్ సంచయ్ జన్ భగీదారీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు

Update: 2024-09-06 13:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ శుక్రవారం గుజరాత్‌లో కొత్తగా ‘జల్ సంచయ్ జన్ భగీదారీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని క్రింద గుజరాత్ అంతటా దాదాపు 24,800 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌లను నిర్మించనున్నారు. వర్షపు నీటిని సేకరించి, నీటి కొరత సమస్య నుంచి బయటపడటం దీని లక్ష్యం. కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మాట్లాడిన మోడీ, నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. జీవులన్ని నీటి నుండి ఉద్భవించాయి, అందుకే నీటిని దానం చేయడం, పొదుపు చేయడం చాలా ముఖ్యం. నీటి సంక్షోభాలకు పరిష్కారాలను కనిపెట్టాలి. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణకు కృషి చేయాలని చెప్పారు.

అలాగే, భారతదేశ సాంస్కృతిక చైతన్యంలో నీటి సంరక్షణ ఎల్లప్పుడూ అంతర్భాగం, నీటి కొరతను పరిష్కరించడానికి కొత్త, వినూత్న సాంకేతికతను అవలంబించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా, ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో వస్తున్న వరదలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్‌లో ఇంత భారీ వర్షాలు గతంలో ఎన్నడూ చూడలేదు. దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా వరదలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇలాంటి విపత్కర సమయాల్లో దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ భుజం భుజం కలిపి సహాయం చేసుకుంటున్నారు. అన్ని శాఖలు కూడా వరదలపై సమన్వయంతో పని చేస్తున్నాయని మోడీ చెప్పారు.


Similar News