IMA : 5 డిమాండ్లతో ప్రధాని మోడీకి ఐఎంఏ లేఖ

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటనతో వైద్యవర్గాల్లో ప్రత్యేకించి మహిళా వైద్యసిబ్బందిలో అభద్రతా భావం పెరిగిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పేర్కొంది.

Update: 2024-08-17 16:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటనతో వైద్యవర్గాల్లో ప్రత్యేకించి మహిళా వైద్యసిబ్బందిలో అభద్రతా భావం పెరిగిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పేర్కొంది. ఈ తరుణంలో దేశంలో డాక్టర్ల భద్రతకు భరోసా కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి కోరింది. ఈమేరకు ఐదు డిమాండ్లతో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఐఎంఏ లేఖ రాసింది.

ఐఎంఏ ఐదు సూచనలివీ..

1. వైద్యులు, ఆస్పత్రులకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ‘ప్రొహిబిషన్ ఆఫ్ వయొలెన్స్ అండ్ డ్యామేజ్ టు ప్రాపర్టీ బిల్-2019’ ముసాయిదాను చట్టరూపంలోకి తెచ్చి అమలు చేయాలి.

2. ఎయిర్ పోర్టుల తరహాలో ఆస్పత్రులకు కూడా పకడ్బందీ భద్రతను కల్పించాలి. ఇందుకోసం ఆస్పత్రులను సేఫ్ జోన్‌‌లుగా ప్రకటించాలి. ఆస్పత్రులు ఉండే ఏరియాల్లో ప్రభుత్వాలే సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలి.

3. కోల్‌కతాలో చనిపోయిన జూనియర్ వైద్యురాలు నిరాటంకంగా 36 గంటల పాటు డ్యూటీ షిఫ్టులో పనిచేసింది. అలాంటి పనివేళలకు పరిమితి విధించాలి. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేకమైన గదులు తప్పనిసరిగా ఉండేలా చూడాలి.

4. వైద్యులపై దురాగతాలు జరిగినప్పుడు ఆయా కేసుల దర్యాప్తును వేగవంతంగా, నిర్దిష్ట వ్యవధిలోగా పూర్తయ్యేలా చూడాలి.

5. కోల్‌కతాలో హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం తగిన పరిహారాన్ని అందించి ఆదుకోవాలి.

పోస్టుమార్టం రిపోర్టుపై తప్పుడు ప్రచారం : కోల్‌కతా పోలీస్ కమిషనర్

హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలి డెడ్‌బాడీలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందని పోస్టుమార్టంలో గుర్తించారంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధమని కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ గోయల్ వెల్లడించారు. సీబీఐ దర్యాప్తుకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని ఆయన తెలిపారు. మరోవైపు 43 మంది డాక్టర్లను బదిలీ చేస్తూ బెంగాల్‌ ప్రభుత్వం శనివారం ఉదయం ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే కోల్‌కతా ఘటన నేపథ్యంలో ఈ ఉత్తర్వులను వైద్యసంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. నిరసనల్లో పాల్గొంటున్నందుకే వైద్యులను బదిలీ చేస్తున్నారని ఆరోపించాయి. దీనిపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ 43 మంది డాక్టర్ల బదిలీల ఉత్తర్వును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News