Ajit Pawar: నాకూ సీఎం కావాలని ఉంది.. ఎట్టకేలకు మౌనం వీడిన డిప్యూటీ సీఎం

ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం మౌనం వీడారు.

Update: 2024-09-17 11:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తనకూ సీఎం కావాలని ఉందంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న తరుణంలో సీఎం పదవిపై ఆయన మౌనం వీడటంపై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దగ్దుషేత్ హల్ద్వాయ్ గణపతి ఆలయంలో పూజలు చేసిన తర్వాత మాట్లాడిన అజిత్ పవార్.. అందరూ తమ నాయకుడు సీఎం కావాలని కోరుకుంటారు. అయితే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలనే అందరి ఆకాంక్ష నెరవేరదు. ఇది జరగాలంటే ఓటర్ల చేతిలో ఉంటుంది. 288 స్థానాలకు గాను 145 సీట్లు దక్కించుకోవడం చాలా అవసరం అన్నారు.

అలాగే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కూడిన మహాకూటమి నేతృత్వంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామన్నారు. మళ్లీ మహాకూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి సమిష్టి ప్రయత్నం చేస్తామన్నారు. మహాకూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి పదవిపై అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి కావాలని శివసేన నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్న తరుణంలో పవార్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.


Similar News