తిహార్ జైలులో గ్యాంగ్ వార్..ఓ ఖైదీకి కత్తి పోట్లు
ఢిల్లీలోని తిహార్ జైలులో మరోసారి గ్యాంగ్ వార్ ఘటన వెలుగు చూసింది. రెండు ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ ఖైదీ కత్తి పోట్లకు గురైనట్టు పోలీసులు వెల్లడించారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని తిహార్ జైలులో మరోసారి గ్యాంగ్ వార్ ఘటన వెలుగు చూసింది. రెండు ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ ఖైదీ కత్తి పోట్లకు గురైనట్టు పోలీసులు వెల్లడించారు. ప్రత్యర్థి ముఠాల మధ్య ఈ గొడవ జరిగినట్టు తెలిపారు. హత్య కేసులో భాగంగా విచారణలో ఉన్న ఖైదీ హితేష్కు తీవ్రగాయాలు కాగా..దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం 11:15 గంటలకు గోగి గ్యాంగ్కు చెందిన హితేష్, టిల్లు తాజ్పురియా గ్యాంగ్కు చెందిన మరో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని ఒక అధికారి తెలిపారు. ఈ క్రమంలోనే హితేష్ను పదునైన ఆయుధంతో పొడిచినట్టు చెప్పారు. హితేష్పై దాడి చేసిన వారిని గౌరవ్ లోహ్రా, గురిందర్లుగా గుర్తించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు ఢిల్లీ పోలీస్ కమిషనర్ విచిత్ర వీర్ తెలిపారు. ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. హితేశ్ 2019 నుంచి జైలులో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, గతేడాది కూడా గ్యాంగ్స్టర్ తాజ్పురియాను ప్రత్యర్థి ముఠాలోని పలువురు కత్తులతో పొడిచి చంపిన విషయం తెలిసిందే.