Farmers tractor march: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతుల ట్రాక్టర్ల ర్యాలీ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ(Farmers tractor march) నిర్వహించారు. తమ పంటలకు కనీస మద్దతు ధర (MSP)పై కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు

దిశ, నేషనల్ బ్యూరో: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ(Farmers tractor march) నిర్వహించారు. తమ పంటలకు కనీస మద్దతు ధర (MSP)పై కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గణతంత్ర దినోత్సవం రోజు కేంద్రానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ట్రాక్టర్లతో రైతులు నిరసన తెలపాలని సంయుక్త కిసాన్ మోర్చా జనవరి 8న పిలుపునిచ్చింది. అందలో భాగంగానే రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఆదివారం పంజాబ్, హర్యానాతోపాటు పలు రాష్ట్రాల్లో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఇకపోతే, 2024 ఫిబ్రవరి 13 నుంచి పంజాబ్, హర్యానా సరిహద్దులోని ఖనౌరిలో రైతులు నిరసన కొనసాగిస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధరతోపాటు రుణ మాఫీ, రైతులు, కార్మికులకు పెన్షన్లు, 2021లో లఖింపూర్ ఖేరీ హింసా బాధితులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే 2020 నుంచి 2021 వరకు ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన నిరసనల కంటే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని సంయుక్త కిసాన్ మోర్చా తాజాగా హెచ్చరించింది. గతేడాది డిసెంబర్ 6, 8, 14 తేదీల్లో 101 మంది రైతుల బృందం నడిచి ఢిల్లీకి పాదయాత్ర చేయడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అనేకసార్లు అడ్డుకున్నారు.