Raj Thackeray: వాట్సాప్లో చరిత్ర చదవడం మానేయండి.. ఔరంగజేబు సమాధి వివాదంపై రాజ్ థాక్రే
మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధి విషయంలో నెలకొన్న వివాదంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే స్పందించారు.

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర (Maharashtra)లో ఔరంగజేబు (Aurangzeb) సమాధి విషయంలో నెలకొన్న వివాదంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాక్రే (Raj Thackrey) స్పందించారు. చరిత్రను కులం, మతం అనే కోణంలో చూడకూడదని తెలిపారు. చారిత్రక సమాచారం కోసం ప్రజలు వాట్సాప్ (Whatsapp) పై ఆధారపడొద్దని చెప్పారు. వాట్సాప్లో పంపే సందేశాల ఆధారంగా చరిత్రను అర్థం చేసుకోవద్దని, సరైన చారిత్రక వాస్తవాలను తెలుసుకోవడానికి పుస్తకాలు చదవాలని సూచించారు. మహారాష్ట్రలో ఆదివారం జరిగిన ఓ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. మొఘల్ పాలకుడు ఔరంగజేబు శివాజీ అనే ఆలోచనను నిర్మూలించడానికి ప్రయత్నించాడని, కానీ ఈ విషయంలో ఆయన విఫలమై చివరకు మహారాష్ట్రలో మరణించాడని తెలిపారు.
మతం ఆధారంగా ఏ దేశం కూడా ముందుకు సాగలేదని నొక్కి చెప్పారు. ‘మతం ఇంటి నాలుగు గోడలలోనే ఉండాలి. ముస్లింలు వీధుల్లోకి వచ్చినప్పుడు, అల్లర్ల సమయంలో మాత్రమే హిందువు హిందువుగా గుర్తిస్తారు. లేకపోతే హిందువులు కులాల వారీగా విభజించబడతారు’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత కాలంలో నిజమైన సమస్యలను మనం మరచిపోయామన్నారు. ఇటీవల విడుదలైన ఛావా సినిమాను ప్రస్తావిస్తూ.. కేవలం మూవీ చూసి అవగాహన పెంచుకునే హిందువులు ప్రయోజనం లేనివారని విమర్శించారు.