ఫడ్నవీస్ ఒక విలన్..సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌పై శివసేన(యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Update: 2024-06-06 08:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌పై శివసేన(యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఫడ్నవీస్ ఒక విలన్ లాంటి వారని అభివర్ణించారు. ఎన్నో కుటుంబాలను ఆయన నాశనం చేశారని, ప్రతీకార రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఢిల్లీలో గురువారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో విలన్ ఎవరైనా ఉన్నారంటే అది ఫడ్నవీస్ అని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కూడా ఆయనే కారణమని నొక్కి చెప్పారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బ్రూట్ మెజారిటీ వచ్చిన తర్వాత మోడీ, అమిత్ షా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను బానిసలుగా మార్చేందుకు ప్రయత్నించారని, అయితే ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పుడు మోడీని ఇంటికి పంపే స్థితిలో ఉందన్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైనందున మోడీ ప్రధాని కాలేరని అన్నారు. ఒకవేళ మూడోసారి బలవంతంగా ప్రధాని కావాలని ప్రయత్నిస్తే ఆయన ప్రభుత్వం కొనసాగదని, ప్రత్యామ్నాయం కోసం ఆర్‌ఎస్‌ఎస్ కృషి చేస్తోందని తెలిపారు. మోడీపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆరోపించారు. ఎన్నికలు మొత్తం మోడీ ఆధ్వర్యంలోనే జరిగినప్పటికీ మెజారిటీ రాలేదని చెప్పారు. మోడీ నాయకత్వాన్ని అంగీకరించడానికి దేశ ప్రజలు సిద్ధంగా లేరని అర్థమైందన్నారు. ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం పదవి నుంచి వైదొలగాలని ప్రతిపాదించిన మరుసటి రోజే సంజయ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, మహారాష్ట్రలోని 48 లోకసభ స్థానాలకు గాను బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమికి 17 సీట్లు రాగా.. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలతో కూడిన మహా వికాస్ అఘాడీ 30 సీట్లు గెలుచుకుంది. 


Similar News