Delhi: ఢిల్లీలో వాయుకాలుష్యం తగ్గించేందుకు కృత్రిమ వర్షాలు

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

Update: 2024-09-25 10:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నవంబర్‌లో వాయు కాలుష్యం గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. దీంతో, ఆ నెలలో కృత్రిమ వర్షాలు కురిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ‘‘నవంబర్ 1 నుంచి 15 వరకు రాజధాని ప్రాంతంలో కృత్రిమ వర్షాలు కురిపించేందుకు యత్నిస్తున్నాం. చలికాలంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను రూపొందించాం. కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర పర్యావరణ మంత్రికి లేఖ రాశాం. కేంద్ర సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం’’ అని గోపాల్ రాయ్ పేర్కొన్నారు.

తగ్గిన వాయుకాలుష్యం

2016-2023 మధ్య రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం 34.6 శాతం తగ్గిందని మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఢిల్లీలో నాలుగేళ్లలో దాదాపు రెండు కోట్ల చెట్లను నాటామని, అందువల్లే వాయు కాలుష్యాన్ని తగ్గించామన్నారు. ఎక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతాలను డ్రోన్ల ద్వారా పరిశీలిస్తామన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ, రవాణా మంత్రిత్వ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ దిల్లీ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ సిబ్బందితో సహా 86 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.


Similar News