Cyber scam: భారీ సైబర్ స్కామ్.. రూ.11 కోట్లు కోల్పోయిన బెంగళూరు టెకీ
బెంగళూరులోని టెక్ పరిశ్రమలో పని చేస్తు్న్న ఓ వ్యక్తి సైబర్ స్కామ్కు గురయ్యారు. కొందరు మోసగాళ్లు ఫోన్ చేసి బెదిరించడంతో రూ.11 కోట్లు పోగొట్టుకున్నాడు.

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరులోని టెక్ పరిశ్రమలో పని చేస్తు్న్న ఓ వ్యక్తి సైబర్ స్కామ్ (Cyber scam) కు గురయ్యారు. కొందరు మోసగాళ్లు ప్రభుత్వ అధికారుల వలె నటిస్తూ ఆయనకు ఫోన్ చేసి బెదిరించడంతో రూ.11 కోట్లు పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్ కుమార్ (Vijay kumar) అనే వ్యక్తి బెంగళూరులోని ఓ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆయన మార్కెట్లో రూ.50లక్షలు పెట్టుబడి పెట్టగా అది రూ.12 కోట్లకు పెరిగింది. ఈ విషయం తెలుసుకున్న నిందితుకు విజయ్కు ఫోన్ చేయడం మొదలు పెట్టారు. పోలీసు, కస్టమ్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులుగా చెబుతూ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో విజయ్ కుమార్ తన ఆధార్, పాన్ కార్డ్, కేవైసీ వంటి వ్యక్తిగత వివరాలను వారికి అందజేశారు. అనంతరం అనేక రోజులుగా తొమ్మిది బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమచేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అలహాబాద్లోని ఒకే ఖాతాలో రూ.7.5 కోట్లు జమైనట్టు గుర్తించారు. అనంతరం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరైన ధవల్ షా బంగారం కొనుగోలుకు ఈ డబ్బును ఉపయోగించాడని పోలీసులు తెలిపారు. దుబాయ్కి చెందిన ఓ మోసగాడి సూచనల మేరకు షా పనిచేసి గోల్డ్ కొనుగోలుకు ఏర్పాట్లు చేసినందుకు రూ.1.5 కోట్లు కమీషన్ తీసుకున్నట్లు విచారణలో తేలింది.