Crown Prince: అబుదాబి క్రౌన్ ప్రిన్స్‌తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ !

అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు.

Update: 2024-09-09 08:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రధాని మోడీ సోమవారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. భారత్, అబుదాబిల మధ్య వ్యూహాత్మక సంబంధాలను పెంచడంపై దృష్టి సారించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, పీయూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా, అబుదాబి యువరాజు భారత్‌కు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

షేక్ ఖలీద్ పర్యటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. ‘భారత్, యూఏఈలు చరిత్రాత్మకంగా సన్నిహిత సంబంధాలను పంచుకుంటాయి. ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం రాజకీయ, వాణిజ్యం, పెట్టుబడి, కనెక్టివిటీ, ఇంధనం, సాంకేతికత, విద్య సహా అనేక రంగాలలో మంచి సహకారం ఉంది’ అని పేర్కొంది. క్రౌన్ ప్రిన్స్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో నూతన భాగస్వామ్యానికి తెరుస్తుందని తెలిపింది. భారత పర్యటనలో భాగంగా క్రౌన్ ప్రిన్స్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ భేటీ కానున్నారు. అలాగే ముంబైలో మంగళవారం జరిగే బిజినెస్ ఫోరమ్‌ సదస్సులో పాల్గొననున్నారు.  


Similar News