NEET UG : ఆగస్టు 14 నుంచి నీట్ యూజీ కౌన్సెలింగ్

దిశ, నేషనల్ బ్యూరో : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-యూజీ) కౌన్సెలింగ్‌ ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానుంది.

Update: 2024-07-31 17:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-యూజీ) కౌన్సెలింగ్‌ ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానుంది. ఈవిషయాన్ని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సెక్రటరీ బి.శ్రీనివాస్ బుధవారం వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారమే తాము ఆగస్టు 14న నీట్ యూజీ కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుందన్నారు.

కౌన్సెలింగ్ ఆన్‌లైన్‌లో నాలుగు విడతల్లో జరుగుతుందని.. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన అర్హులైన విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చని బి.శ్రీనివాస్ వెల్లడించారు. మెరిట్ అండ్ ఛాయిస్ ప్రాతిపదికన విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గత శుక్రవారం రోజే నీట్ యూజీ రివైజ్డ్ ఫలితాలు వెలువడ్డాయి. వాటిలో 17 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు వచ్చాయి. మునుపటి ఫలితాలతో పోలిస్తే.. ఒకటో ర్యాంకు సాధించిన  విద్యార్థుల సంఖ్య 75 శాతం తగ్గిపోయింది. ఐఐటీ ఢిల్లీ నిపుణుల సూచన మేరకు.. 29వ ప్రశ్నకు సమాధానం మారిపోవడంతో ఈ మార్పు చోటుచేసుకుంది.

Tags:    

Similar News