Shivaji statue: శివాజీ విగ్రహం కూలిన ఘటనలో కన్సల్టెంట్ అరెస్ట్

మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఇటీవల 35 అడుగుల ఛత్రపతి శివాజీ కూలిన ఘటనలో నిర్మాణ రూపకల్పనలో పాలుపంచుకున్న

Update: 2024-08-30 04:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఇటీవల 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనలో నిర్మాణ రూపకల్పనలో పాలుపంచుకున్న కన్సల్టెంట్‌ను తాజాగా అరెస్టు చేశారు. కొల్హాపూర్ క్రైం బ్రాంచ్, మల్వాన్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో శుక్రవారం తెల్లవారుజామున కొల్హాపూర్‌కు చెందిన చేతన్ పాటిల్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. పాటిల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం సింధుదుర్గ్ పోలీసులకు అప్పగించినట్లు కొల్హాపూర్ పోలీసు సూపరింటెండెంట్ మహేంద్ర పండిట్ ధృవీకరించారు. విగ్రహం కూలిన ఘటనలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు చేతన్ పాటిల్ పేరును ఇంతకుముందు చేర్చగా, ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు.

అయితే పాటిల్ గతంలో మాట్లాడుతూ, థానేకు చెందిన కంపెనీ విగ్రహానికి సంబంధించిన పనులను నిర్వహించిందని తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. ఇదిలా ఉంటే మరాఠా నౌకాదళం, ఛత్రపతి శివాజీ మహారాజ్ సముద్ర రక్షణ, భద్రత, దాని చారిత్రక సంబంధాన్ని గౌరవించే లక్ష్యంతో సింధుదుర్గ్‌లో మొదటిసారిగా నిర్వహించిన నౌకాదళ దినోత్సవ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 4, 2023న ఈ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. అయితే ఆగస్టు 26, సోమవారం మధ్యాహ్నం విగ్రహాం 1 గంటలకు కూలిపోయింది.

ప్రస్తుతం ఈ ఘటన మహారాష్ట్రలో రాజకీయ తుఫానును రేకెత్తించింది. విగ్రహం ఎందుకు కూలిపోయిందో తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టును భారత నావికాదళం పర్యవేక్షించిందని ప్రభుత్వం ఎత్తిచూపింది. మరోవైపు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని అధికార నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఈ ఘటనపై మహారాష్ట్ర అంతటా మౌన నిరసనలు చేపట్టారు.


Similar News