Haryana Assembly elections: కాంగ్రెస్ లో చేరిన వినేశ్ ఫొగాట్, భజరంగ్ పూనియా

భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పూనియా కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ సీనియర్‌ నేతల మధ్య హస్తం తీర్థం పుచ్చుకున్నారు.

Update: 2024-09-06 10:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పూనియా కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ సీనియర్‌ నేతల మధ్య హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఇక, వినేష్ ఫోగట్, భజరంగ్ పునియా ఇటీవలే కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కూడా కలిశారు. ఇకపోతే, రోడ్ నంబర్ 10, రాజాజీ మార్గ్ లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తో ఇద్దరు రెజ్లర్లు భేటీ య్యారు. "చక్ దే ఇండియా, చక్ దే హర్యానా! ప్రపంచంలో భారతదేశం గర్వపడేలా చేసిన మా ప్రతిభావంతులైన చాంపియన్లు వినేష్ ఫోగట్, భజరంగ్ పునియాలతో భేటీ అయ్యాను. మీ ఇద్దర్ని చూసి గర్విస్తున్నా" అని ఖర్గే సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ రెజ్లర్ల చేరికతో అక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాగా, వీరిద్దరూ హస్తం పార్టీలో చేరడంతో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది. వినేశ్, భజరంగ్ చేరిక వల్లే హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఇప్పటి వరకు ప్రకటించలేదని సమాచారం.

రైల్వేలో ఉద్యోగానికి రాజీనామా

మరోవైపు.. ఈ పరిణామాల మధ్య వినేష్ ఫొగాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైల్వేలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. నార్తర్న్ రైల్వేలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ/స్పోర్ట్‌ లెవెల్-7గా ఆమె పనిచేస్తున్నారు. మరోవైపు, ఫొగాట్, పునియా ఇద్దరూ బీజేపీ మాజీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ కు వ్యతిరేకంగా నిరసన కూడా చేపట్టారు. ఇదిలా ఉండగా.. అక్టోబర్ 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు, ఆప్‌తో పొత్తు అంశంపై కూడా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కోసం ఇంకా రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరలేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం చేస్తోంది. కానీ, ఆప్ మాత్రం 10 స్థానాలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో, అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.


Similar News