లక్నో: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో కానీ.. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’లో కానీ చేరేది లేదని బీఎస్పీ చీఫ్ మాయావతి తేల్చి చెప్పారు. ఈ రెండు కూటములకు పూర్తిగా దూరంగా ఉంటామని పునరుద్ఘాటించారు. రాబోయే లోక్సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో పార్టీ సంసిద్ధతపై సీనియర్ నేతలతో ఆమె ఆదివారం సమీక్షించారు. ఎన్డీఏ, ఇండియాలకు దూరంగా ఉంటూ.. బీఎస్పీని బలోపేతం చేయడంపై ఫోకస్ చేస్తామని మాయావతి వెల్లడించారు.
దేశంలో పేదరికం, నిరుద్యోగం, శాంతిభద్రతలు, ప్రజారోగ్యం, విద్యారంగ సమస్యలు మునుపటిలాగే ఉన్నాయని.. పరిస్థితులు బీజేపీ హయాంలోనూ పెద్దగా మారలేదని విమర్శించారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో బీజేపీ, కాంగ్రెస్ల వైఖరి దాదాపు ఒకేలా.. ప్రజా వ్యతిరేకంగా ఉందని మండిపడ్డారు. తప్పుడు వార్తలు, రాజకీయ కుట్రలపట్ల అలెర్ట్గా ఉండాలని బీఎస్పీ క్యాడర్కు ఆమె సూచించారు.