Parliament: కర్ణాటక ముస్లిం కోటా బిల్లుపై రాజ్యసభలో గందరగోళం
కర్ణాటక ముస్లిం కోటా బిల్లుపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం(Karnataka Congress government) ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించడంపై రాజ్యసభలో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక ముస్లిం కోటా బిల్లుపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం(Karnataka Congress government) ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించడంపై రాజ్యసభలో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పార్టీ " మళ్లీ దేశాన్ని విభజించడానికి" ప్రయత్నిస్తోందని ఆరోపించింది. అంతేకాకుండా ముస్లిం రిజర్వేషన్లను కేంద్ర మంత్రి నడ్డా,బీజేపీ ఎంపీలు ఖండించారు. కర్ణాటక ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నదంటూ ఆందోళనకు దిగారు.. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు సమాధానం చెప్పాలంటూ రాజ్యసభ(Rajya Sabha)లో జేపీ నడ్డా డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు.. డీకే శివకుమార్ పై విమర్శలు గుప్పించారు. కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. "రాజ్యాంగ పదవిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన బాధ్యతాయుతమైన, సీనియర్ నేత డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం సమాజానికి కాంట్రాక్టులలో రిజర్వేషన్లు కల్పించడానికి భారత రాజ్యాంగాన్ని మార్చబోతున్నామని ప్రకటించారు. ఇది కచ్చితంగా భారత రాజ్యాంగంపైనే దాడి. ఈ ప్రకటనను తేలికగా తీసుకోలేం" అని అన్నారు. డీకే శివకుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నెలకొన్న గందరగోళం మధ్య రాజ్యసభను రెండు గంటలకు వాయిదా పడింది.
రాజ్యసభలో గందరగోళం
రాజ్యాంగంపై డీకే చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో గందరగోళం చెలరేగగా.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. "బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరు. రిజర్వేషన్లను ఎవరూ పూర్తి చేయలేరు. దాన్ని రక్షించడానికే మేం కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర చేశాం. వారు (ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశిస్తూ) భారతదేశాన్ని విచ్ఛిన్నం చేశారు" అని ఆరోపించారు. ఇకపోతే, కర్ణాటక ప్రభుత్వ టెండర్లలో ముస్లిం కాంట్రాక్టర్లకు నాలుగు శాతం కోటా ఇచ్చేందుకు ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. ఇటువంటి బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని కర్ణాటక బీజేపీ హెచ్చరించింది. కర్ణాటక ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ చట్టంలో సవరణ తీసుకువచ్చి, కేటగిరీ 2బీ కింద రిజర్వేషన్(Reservation) విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. కేటగిరీ 2బీలో ముస్లిం కాంట్రాక్టర్లు ఉంటారని ఆయన తెలిపారు. కేటగిరీ వన్లో ఎస్సీ, ఎస్టీలు, క్యాటగిరీ 2ఏలో వెనుకబడిన తరగతులు వారు ఉంటారన్నారు. కేటీపీపీ చట్టం కింద ఇకపై ముస్లిం కాంట్రాక్టర్లు సుమారు రెండు కోట్ల మేరకు విలువ కలిగిన ప్రభుత్వ పనులు చేసేందుకు అర్హులు కానున్నారు.