బీజేపీ ఐటీ సెల్ చీఫ్‌పై కేసు.. ఆయనపై ట్వీట్ చేయడమే కారణం

బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల‌వీయ‌పై బెంగ‌ళూర్‌లో కేసు న‌మోదైంది.

Update: 2023-06-28 12:57 GMT

న్యూఢిల్లీ: బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల‌వీయ‌పై బెంగ‌ళూర్‌లో కేసు న‌మోదైంది. "కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రమాద‌కారి. ఆయ‌న రాజకీయాల్లో డేంజరస్ గేమ్ ఆడుతున్నారు" అంటూ మాల‌వీయ‌ చేసిన ట్వీట్‌పై కర్ణాటక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ర‌మేష్ బాబు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ కేసు న‌మోదులో రాజ‌కీయ దురుద్దేశం ఉందని బీజేపీ ఎంపీ తేజ‌స్వి సూర్య ఆరోపించారు. "మాల‌వీయ‌పై ఐపీసీ 153ఏ, 505(2) సెక్షన్లు కింద కేసు న‌మోదు చేశారు.

ఈ రెండు సెక్షన్లు వివిధ గ్రూపుల మ‌ధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించే వారిపై న‌మోదు చేస్తారు. అయితే రాహుల్ గాంధీ ఓ వ్యక్తా..? లేదా ఓ వ‌ర్గమా..?" అని ఆయన ప్రశ్నించారు. దీనిపై తాము కోర్టులో స‌వాల్ చేస్తామన్నారు. చ‌ట్టాన్ని ఎదుర్కోవాల్సిన సంద‌ర్భంలో బీజేపీకి కేక‌లు వేయ‌డం అల‌వాటుగా మారింద‌ని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే పేర్కొన్నారు. దేశ చ‌ట్టాల‌ను అనుస‌రించ‌డం వారికి స‌మ‌స్యగా మారింద‌ని ఎద్దేవా చేశారు.


Similar News