జేఎంఎం క్యాంపు పాలిటిక్స్‌కు బీజేపీ బ్రేక్.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలుపు

జార్ఖండ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం గంటగంటకో మలుపు తిరుగుతున్నది. బీజేపీ ప్రలోభాల నుంచి జేఎంఎం (జార్ఖండ్ ముక్తి మోర్చా), ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదళ్), కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైదరాబాద్‌లో క్యాంపు ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరిగాయి.

Update: 2024-02-02 02:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: జార్ఖండ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం గంటగంటకో మలుపు తిరుగుతున్నది. బీజేపీ ప్రలోభాల నుంచి జేఎంఎం (జార్ఖండ్ ముక్తి మోర్చా), ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదళ్), కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైదరాబాద్‌లో క్యాంపు ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరిగాయి. వారిని సేఫ్‌గా ఉంచేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. స్పెషల్ ఫ్లైట్లలో రాంచీ నుంచి వచ్చే ఆ కూటమి ఎమ్మెల్యేలకు హోటళ్లలో బస సౌకర్యాలూ సిద్ధమయ్యాయి. షెడ్యూలు ప్రకారం గురువారం సాయంత్రమే రెండు స్పెషల్ ఫ్లైట్‌లలో వారు హైదరాబాద్‌కు రావాల్సి ఉన్నది. వారిని రిసీవ్ చేసుకునేందుకు బేగంపేట్ ఎయిర్‌పోర్టులో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెయిట్ చేశారు. కానీ విమానాలు టేకాఫ్ కాకపోవడంతో ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

ఇంతలోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా చంపై సోరేన్‌కు రాజ్‌భవన్ నుంచి పిలుపు వచ్చింది. ఆ ప్రకారం శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రిగా ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించేందుకు టైమ్ ఫిక్స్ అయింది. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చేతుల మీదుగా చంపై సోరేన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పది రోజుల వ్యవధిలో అసెంబ్లీ వేదికగా బల నిరూపణ చేసుకోవాలని షరతు విధించారు. దీంతో కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు షిప్ట్ చేసి క్యాంపులో ఉంచాలనే నిర్ణయం తాత్కాలికంగా వాయిదా పడింది. మరికొన్ని గంటల్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం కావడంతో రాత్రికి రాత్రే బీజేపీ ఎలాంటి కుట్రలు పన్నుతుందోననే చర్చలు ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి.

వాతావరణ ప్రతికూలతలు (మంచు) కారణంగానే ఫ్లైట్‌లు టేకాఫ్ కాలేదని, స్పెషల్ ఫ్లైట్‌లే కాకుండా మొత్తం మూడు మూడు విమానాల సర్వీసులు రద్దయ్యాయని రాంచీ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ మయూర తెలిపారు. కానీ ఈ వివరణలను ఆ కూటమి పార్టీల నేతలు విశ్వసించలేదు. రాజకీయంగా తెరవెనక బీజేపీ నడిపిస్తున్న నాటకమని కూటమి నేతలు అనుమానిస్తున్నారు. తగినంత సంఖ్యాబలం ఉన్నప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాజ్‌భవన్‌కు సమాచారం పంపినా ఉద్దేశపూర్వకంగానే గవర్నర్ జాప్యం చేస్తున్నారని జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ ఠాకూర్ ఆరోపించారు. విమానాలు టేకాఫ్ కాకపోవడంతో తిరిగి రాంచీలోని సర్క్యూట్ హౌజ్‌కు వెళ్ళిపోయారని వివరించారు.

బిహార్‌లో ఇదే తరహా రాజకీయ సంక్షోభం నెలకొన్న తర్వాత గంటల వ్యవధిలోనే ప్రభుత్వ ఏర్పాటుకు అక్కడి గవర్నర్ చొరవ తీసుకుని సక్సెస్‌పుల్‌గా వ్యవహరించగా జార్ఖండ్ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతున్నదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హేమంత్ సోరేన్ రాజీనామాతో తదుపరి ముఖ్యమంత్రిగా చంపై సోరేన్ బాధ్యతలు చేపట్టేలా ఆ పార్టీ నేతగా జేఎంఎం ఎమ్మెల్యేలు ఎన్నుకున్నా గవర్నర్ నుంచి పిలుపు రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకాలేదు. చివరకు శుక్రవారం ఉదయం ముహూర్తం ఖరారు కావడంతో అప్పటివరకూ ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొన్నది.

Tags:    

Similar News