Actor Darshan: దర్శన్ కు జైళ్లో వీఐపీ ట్రీట్మెంట్.. దర్యాప్తునకు 3 బృందాలు

నటుడు దర్శన్ తూగుదీప జైలులో వీఐపీ ట్రీట్మెంట్ పొందుతున్నారనే ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం విచారణ జరుపుతోంది.

Update: 2024-08-27 07:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నటుడు దర్శన్ తూగుదీప జైలులో వీఐపీ ట్రీట్మెంట్ పొందుతున్నారనే ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం విచారణ జరుపుతోంది. మూడు ప్రత్యేక పోలీసు బృందాలను విచారణ కోసం ఏర్పాటు చేసింది. ఇటీవల బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు లోపల నుండి ఒక ఫోటో వైరల్ గా మారింది. దానిపైనే ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టనున్నాయి. ఆగ్నేయ డివిజన్ డీసీపీ సారా ఫాతిమా ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటైన బృందాలు.. మూడు కేసులపై దర్యాప్తు చేపట్టనున్నాయి. మొదటి కేసు నటుడికి పానీయాలు ఎలా అందుబాటులోకి వచ్చాయి? జైలు గార్డెన్ లో ఉన్నప్పుడు సిగరెట్ ఎలా తాగాడు? కుర్చీలు ఎవరు ఏర్పాటు చేశారు? అనే అంశాలపై విచారణ జరగనుంది. అదేవిధంగా గ్యాంగ్ స్టర్ తో దర్శన్ కు ఉన్న సంబంధంపై ఆరా తీయనుంది. రెండవ కేసు జైలు లోపల మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి ఫోటోలు, వీడియోకాల్ లు తీయడంపైన దృష్టి సారించనుంది. నిందితుడికి మొబైల్ ఫోన్ ఎలా వచ్చింది? ఇంటర్నెట్ సదుపాయం ఎవరు ఏర్పాటు చేశారు? అనే విషయాలపై విచారణ జరుగుతుంది. ఇక మూడో కేసు జైలు అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించినది కాగా.. దీనిని ఏసీపీ మంజునాథ్‌ దర్యాప్తు జరుపుతున్నారు.

హత్య కేసులో నిందితుడిగా..

అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడుగా దర్శన్ జైలులో ఉంటున్నాడు. అయితే, జైలులో ఉన్న దర్శన్ రాచమర్యాదలు అనుభవిస్తున్న వీడియో, ఫొటోలు వైరల్ గా మారాయి. దీంతో, ఏడుగురు జైలు అధికారులపై వేటు పడింది. మరోవైపు, ఈ కేసులో దర్శన్, నటి పవిత్రగౌడ్ సహా 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్శన్, పవిత్రలకు ఈనెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ.. ఆగస్టు 21న బెంగళూరు కోర్టు తీర్పు ఇచ్చింది. ఇకపోతే, జూన్ 9న బెంగుళూరులోని ఓ ఫ్లైఓవర్ సమీపంలో రేణుకాస్వామి డెడ్ బాడీ దొరికింది. నటి పవిత్ర గౌడకు సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన సందేశాలు పంపిన రేణుకాస్వామిని కన్నడ నటుడి సూచనల మేరకు ఓ ముఠా కిడ్నాప్ చేసి హత్య చేసిందని పోలీసులు తెలిపారు.


Similar News