Muhammad Yunus : భారత్ తో సత్సంబంధాలనే కోరుకుంటున్నాం.. బంగ్లాదేశ్ కీలక వ్యాఖ్యలు

భారత్‌తో బంగ్లాదేశ్(Bangladesh) సత్సంబంధాలను కోరుకుంటోందని ఢాకా తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్‌ యూనస్‌ పేర్కొన్నారు.

Update: 2024-09-09 09:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌తో బంగ్లాదేశ్(Bangladesh) సత్సంబంధాలను కోరుకుంటోందని ఢాకా తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్‌ యూనస్‌ పేర్కొన్నారు. అయితే, ఈ సంబంధాలు సమానత్వం, పారదర్శకంగా ఉండాలన్నారు. ఈ విషయాన్ని బంగ్లా ప్రభుత్వ మీడియా బీఎస్‌ఎస్‌ వెల్లడించింది. ఇటీవల ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులు, ఇతర వర్గాలతో మహమ్మద్‌ యూనస్‌ భేటీ అయ్యారు. దీనిపై అడిగిన ప్రశ్నకు ఆయన సహాయకుడు మహఫుజ్‌ ఆలం స్పందించారు. ‘‘మేం భారత్‌తో సత్సంబంధాలు ఉండాలని భావిస్తున్నాం. ఇవి కచ్చితంగా సమాన హోదాతో పారదర్శంకంగా ఉండాల్సిన అవసరం ఉందని యూనస్‌ చెప్పారు’’ అని వెల్లడించారు. పొరుగు దేశాలతో సంబంధాలకు బంగ్లాదేశ్‌ పరస్పర గౌరవం ఇస్తుందన్నారు. సార్క్(సౌత్‌ ఏషియన్‌ అసోసియేషన్‌ రీజనల్‌ కోపరేషన్‌)ను పునరుద్ధరించాలని యూనస్‌ నొక్కి చెప్పినట్లు ఆలం తెలిపారు.

రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలపై బంగ్లా ఆశ్చర్యం

మరోవైపు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వ్యాఖ్యలపై బంగ్లా విదేశాంగశాఖ సలహాదారు ఎండీ తౌహిద్‌ హుస్సేనీ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. రెండు పొరుగు దేశాల మధ్య తక్షణ ఘర్షణ ముప్పును తాను ఊహించలేదన్నారు. తౌహిద్ మాట్లాడుతూ..‘‘రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలను చూసి ఆందోళన చెందడం కన్నా.. ఆశ్చర్యపోయాను. ఆయన అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో తెలీదు. వాటి వెనుకున్న బలమైన కారణమేదీ కన్పించలేదు’’ అని అన్నారు. ఇటీవల లక్నోలో జరిగిన కమాండర్ కాన్ఫరెన్స్ లో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. గాజా, ఉక్రెయిన్‌లో విబేధాలు, అలానే బంగ్లాదేశ్ ప్రస్తుతి పరిస్థతిని ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి వీలుగా సైనికాధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. అనుకోని ఘటనలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులకు పిలుపునిచ్చారు. వీటిపైనే బంగ్లా విదేశాంగ శాఖ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.


Similar News