Supreme Court: అసోంలో కూల్చివేతలు ఆపేయాలంటూ ఆదేశాలు

అసోం ప్రభుత్వంపై సుప్రీం కోర్టు మండిపడింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను హిమంత సర్కారు ఉల్లంఘించిందంటూ పిటిషన్ దాఖలైంది.

Update: 2024-09-30 10:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అసోం ప్రభుత్వంపై సుప్రీం కోర్టు మండిపడింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను హిమంత సర్కారు ఉల్లంఘించిందంటూ పిటిషన్ దాఖలైంది. దీనిపై అసోం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అసోంలోని కామరూప్‌ మెట్రో డిస్ట్రిక్ట్‌ పరిధిలోని సోనపుర్‌ మువాజ ప్రాంతానికి చెందిన 47 మంది పౌరులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం పరిశీలించింది. దీనిపై మూడు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని సూచించింది. ప్రస్తుతానికి అక్కడ కూల్చివేతలు ఆపేయాలంటూ స్టేటస్‌కో కొనసాగించాలని పేర్కొంది. సుప్రీం ఆదేశాలు లేకుండా దేశంలో ఎక్కడా కూల్చివేతలు చేపట్టొద్దని సెప్టెంబర్‌ 17న కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ ఆదేశాలను అసోం ప్రభుత్వం ఉల్లంఘించిందని పిటిషన్ దాఖలైంది.

సోనపుర్ కూల్చివేతలు..

సోనపుర్‌లో అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మార్కింగ్‌ చేసి కూల్చివేతలు మొదలుపెట్టినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదే అంశంపై గౌహతి హైకోర్టులో అడ్వొకేట్‌ జనరల్‌ ఇచ్చిన ప్రమాణపత్రాన్ని కోర్టుకు పేర్కొన్నారు. దీంతో ఆ పిటిషన్లపై విచారణ పూర్తయ్యేవరకు కూల్చబోమని అధికారులు పేర్కొన్నారు. అయినా కూల్చివేతలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లు, రైల్వే లైన్లు, వాటర్‌బాడీస్‌లో ఉన్న నిర్మాణాలను తప్పితే.. మిగిలిన వాటిని కూల్చే ముందు న్యాయస్థానాల అనుమతి తప్పనిసరి అంటూ సెప్టెంబర్‌ 17న కోర్టు చెప్పింది. అయినా తమ ఇళ్లను కూల్చడంపై బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


Similar News