జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు మృతి

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది.

Update: 2024-06-26 08:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. బుధవారం దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం అక్కడి ప్రాంతాలను జల్లెడ పడుతున్న సమయంలో ఉదయం 9.50 గంటల సమయంలో గండోహ్ ప్రాంతంలోని బజాద్ గ్రామంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు దిగడంతో వెంటనే అప్రమత్తమైన వారు తిరిగి ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరింత మంది ఆ ప్రాంతాల్లో ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి.

ఇటీవల జూన్ 11, 12 తేదీల్లో జంట ఉగ్రవాద దాడుల తర్వాత ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) తో పాటు పోలీసులు కూడా అక్కడి ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు. జూన్ 11న, చటర్‌గల్లా వద్ద జాయింట్ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడగా, 12న గండో ప్రాంతంలోని కోట ఎగువన ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు గాయపడ్డాడు. ఈ దాడులు చేసిన తర్వాత ఉగ్రవాదులు అక్కడి దట్టమైన అడవుల్లో, కొండ ప్రాంతాల్లో దాక్కున్నట్టు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు తమ యాంటీ-టెర్రరిస్ట్ ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. జిల్లాలో చొరబడి కార్యకలాపాలు నిర్వహించినట్లు భావిస్తున్న నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదుల సమాచారం అందించాలని అక్కడి ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. అలాగే ఒక్కొక్క ఉగ్రవాదిపై రూ.5 లక్షల రివార్డును ఇస్తామని అధికారులు ప్రకటించారు.


Similar News