Amanatullah Khan: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌కు ఊరట.. ‘వక్ప్’ కేసులో విడుదలకు కోర్టు ఆదేశాలు

ఢిల్లీ వక్ఫ్ బోర్డు అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఊరట లభించింది.

Update: 2024-11-14 07:28 GMT
Amanatullah Khan: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌కు ఊరట.. ‘వక్ప్’ కేసులో విడుదలకు కోర్టు ఆదేశాలు
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ వక్ఫ్ బోర్డు అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ (Amanathullah khan)కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse avencue court) నిరాకరించింది. అమానతుల్లాఖాన్‌ను జ్యుడీషియల్ కస్టడీ నుంచి వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. రూ.లక్ష పూచీకత్తుపై రిలీజ్ చేయాలని తెలిపింది. అమానతుల్లాఖాన్‌కు వ్యతిరేకంగా చాలా సాక్షాలు ఉన్నాయని పేర్కొన్న కోర్టు.. ఆయనను ప్రాసిక్యూషన్‌ చేయడానికి సరైన అనుమతి తీసుకోలేదని స్పష్టం చేసింది. మరో నేత సిద్ధిఖీని కూడా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సిద్ధిఖీకి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని తెలిపింది. ఈ కేసును ప్రత్యే న్యాయమూర్తి జితేంద్ర సింగ్ బుధవారం విచారించి తీర్పును రిజర్వ్ చేశారు. తాజాగా గురువారం వెల్లడించారు.

కాగా, ఢిల్లీలోని ఓఖ్లా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న అమానతుల్లాఖాన్ 2018 నుంచి 2022 వరకు వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఉన్నారు. ఆ సమయంలో వక్ప్ ఆస్తులను లీజుకు తీసుకుని ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 2న ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. అక్టోబర్ 29న 110 పేజీల అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో అమానతుల్లాఖాన్ తో పాటు మరి కొందరిని విచారించేందుకు సాక్షాలు ఉన్నాయని ఈడీ పేర్కొంది. అయితే దీనిని పరిగణనలోకి తీసుకోవడానికి కోర్టు నిరాకరించింది.

Tags:    

Similar News