ఢిల్లీలో బీజేపీ నీటి సంక్షోభం సృష్టించాలని చూస్తుంది: మంత్రి అతిషి

దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ నీటి సంక్షోభం సృష్టించాలని చూస్తుందని ఢిల్లీ క్యాబినెట్ మంత్రి అతిషి బుధవారం ఆరోపించారు.

Update: 2024-05-22 07:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ నీటి సంక్షోభం సృష్టించాలని చూస్తుందని ఢిల్లీ క్యాబినెట్ మంత్రి అతిషి బుధవారం ఆరోపించారు.ఆప్‌ని లక్ష్యంగా చేసుకోవడానికి బీజేపీ "కొత్త కుట్ర" పన్నింది, దాని హర్యానా ప్రభుత్వం ద్వారా దేశ రాజధానికి నీటి సరఫరాను నిలిపివేసిందని జలవనరుల శాఖ మంత్రి అయిన అతిషి అన్నారు. లోక్‌సభ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి ఆప్‌ని టార్గెట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆమె విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

ఎన్నికల ప్రకటన వెలువడిన ఐదు రోజుల్లోనే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు, తద్వారా ఎన్నికలలో ఆప్ ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా, వారు ఆయనను ఇరికించడానికి రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ను ఉపయోగించారు. కానీ ఆ ప్లాన్ కూడా పని చేయలేదని అతిషి చెప్పారు.

ఇంతకుముందు ఎప్పుడు కూడా నీటి కొరతపై ఫిర్యాదులు రాని ప్రాంతాల నుంచి ఇప్పుడు మాత్రమే వస్తున్నాయి. బీజేపీ తన హర్యానా ప్రభుత్వం ద్వారా, ఢిల్లీకి యమునా నీటి సరఫరాను నిలిపివేసింది. యమునా నది నీటి మట్టం వజీరాబాద్‌లో సాధారణంగా 674 అడుగుల వద్ద ఉంటుంది, అది అత్యల్పంగా ఉన్నప్పుడు కూడా 672 అడుగుల వద్ద ఉంటుంది. నీటి మట్టం సరఫరాకు సరిపోయేంత ఉన్నప్పటికీ కూడా బీజేపీ దీనిని అడ్డుకుంటున్నది. దీనిపై హర్యానా ప్రభుత్వానికి లేఖ రాస్తామని ఆమె తెలిపారు. వారి వైపు నుంచి ఎలాంటి చర్యలు లేకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు.

ఆప్ ప్రభుత్వం ప్రతిష్టను దిగజార్చడానికి, ఢిల్లీ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి బీజేపీ ఇలా చేస్తోందని అతిషి ఆరోపించారు. రానున్న రోజుల్లో మే 25 వరకు నీటి ఎద్దడి సృష్టించాలని చూస్తున్నారు, కాబట్టి ఢిల్లీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.


Similar News