Delhi: ఢిల్లీలో మార్షల్స్ పునరుద్ధరణపై బీజేపీ, ఆప్ మధ్య హైడ్రామా

ఢిల్లీలో ఆప్, బీజేపీ నేతల మధ్య మార్షల్స్ పునరుద్ధరణపై హైడ్రామా జరిగింది. ఢిల్లీలోని బస్సుల్లో మార్షల్స్ పునరుద్ధరించాలని అధికార ఆప్, బీజేపీ.. ఎల్జీ వీకే సక్సేనా దగ్గరకు కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి.

Update: 2024-10-06 04:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో ఆప్, బీజేపీ నేతల మధ్య మార్షల్స్ పునరుద్ధరణపై హైడ్రామా జరిగింది. ఢిల్లీలోని బస్సుల్లో మార్షల్స్ పునరుద్ధరించాలని అధికార ఆప్, బీజేపీ.. ఎల్జీ వీకే సక్సేనా దగ్గరకు కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. దీని కోసం బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా దగ్గరకు ఆప్ నేతలు వెళ్లారు. గుప్తా కాళ్లపై పడిన మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఎల్జీ దగ్గరకు రావాలని కోరారు. దీంతో ఆయన అంగీకరించారు. గుప్తా ఆప్ ఎమ్మెల్యేలతో వచ్చేందుకు అంగీకరించడంతో సీఎం ఆతిశీ తన కారును వదిలి వెళ్లి గుప్తాతో కారులో కూర్చున్నారు. వారంతా కలిసి ఎల్జీ ఇంటికి వెళ్లారు. సీఎంతోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు ఎల్జీ ఇంటి లోపలికి వెళ్లారు. కానీ, అంతలోనే ఆప్ నేతలు ఆందోళనకు దిగారు. వినతిపత్రంపై బీజేపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేయలేదని, మార్షల్స్ పునరుద్ధరించాలన్న కేబినేట్ నోట్ ను ఆమోదించాలని బీజేపీ ఎల్జీని కోరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఎల్జీ ఇంటిలోపల ఉండగానే ఆప్ నేతలు ఆందోళన చేపట్టడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

బీజేపీపై ఆగ్రహం

మరోవైపు, ఎల్జీతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి ఆతిశీ కూడా బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. ఎల్జీ సంతకం చేయకపోవడంతో పది వేల మంది మార్షల్స్‌ రోడ్డునపడ్డారని ఆప్‌ నేతలు ఆరోపించారు. ఇకపోతే, బస్సు మార్షల్స్‌ పునరుద్ధరణపై శనివారం ఉదయం బీజేపీ ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రి ఆతిశీని కలిశారు. దీంతో వెంటనే క్యాబినెట్‌ సమావేశమై పునరుద్ధరణకు ఆమోదం తెలుపుతామని ఆమె హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్లే వెంటనే సమావేశం ఏర్పాటు చేసి ఆమోదించారు. ఆ కేబినేట్ నోట్‌ను ఎల్జీ చేత ఆమోదింపజేసేందుకు కలిసి రావాలని బీజేపీ ఎమ్మెల్యేలకు ఆప్‌ నేతలు విజ్ఞప్తి చేశారు. కాగా.. ఆప్ వినతిని బీజేపీ ఎమ్మెల్యేలు తోసిపుచ్చారని అధికార పార్టీ నేతలు మండిపడ్డారు. బుజ్జగించాక వచ్చారని.. కానీ చివరకు వెనకడుగు వేశారని ఫైర్ అయ్యారు.


Similar News