ట్రాలీ బ్యాగుల్లో మృతదేహం.. రెండు ముక్కలుగా మహిళ

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక రైలులో రెండు ట్రాలీ బ్యాగుల్లో రెండు ముక్కలుగా ఉన్న గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు

Update: 2024-06-09 09:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక రైలులో రెండు ట్రాలీ బ్యాగుల్లో రెండు ముక్కలుగా ఉన్న గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. డాక్టర్ అంబేద్కర్ నగర్-ఇండోర్ ప్యాసింజర్ రైలు శనివారం రాత్రి ఇండోర్ స్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులు దిగిన తర్వాత మెయింటెనెన్స్ నిమిత్తం రైలును పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తున్న సమయంలో రైలులో ఒక మూల రెండు అనుమానస్పద ట్రాలీ బ్యాగులను వారు గుర్తించారు. రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో, వెంటనే వారు రైలు వద్దకు చేరుకుని ఆ రెండు బ్యాగులను తెరిచి చూడగా, ఒక దానిలో మహిళ తల నుంచి నడుము వరకు పై భాగం, మరో ట్రాలీ బ్యాగులో నడుము కింది భాగం కనిపించింది. ఆమె రెండు చేతులు, కాళ్లు మాత్రం కనిపించలేదు. ప్రభుత్వ రైల్వే పోలీసులు(GRP) మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

జీఆర్‌పీ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సంజయ్ శుక్లా మాట్లాడతూ, మహిళను చంపి ఆమెను రెండు ముక్కలుగా చేసి రెండు ట్రాలీ బ్యాగుల్లో పెట్టారని అన్నారు. బాధితురాలిని ఇంకా గుర్తించాల్సి ఉందని, 20 నుంచి 25 ఏళ్ల లోపు వయస్సు గల వ్యక్తిగా భావిస్తున్నామని తెలిపారు. మహిళను ఒకటి లేదా రెండు రోజుల క్రితం వేరే ప్రదేశంలో హత్య చేసి, శనివారం రాత్రి రైలులో శరీర భాగాలను ఉంచినట్లు అనుమానిస్తున్నట్లు అధికారి తెలిపారు.


Similar News