డిసెంబర్ నాటికి బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం జూన్ 2024 నాటికి ముగిసింది

Update: 2024-07-14 12:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం జూన్ 2024 నాటికి ముగిసింది. ఈ నేపథ్యంలో తదుపరి అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలోనే నడ్డా పదవీకాలం పూర్తయినప్పటికీ ఎన్నికల దృష్ట్యా దానిని జూన్ వరకు పొడిగించారు. ఇప్పుడు ఈ గడువు ముగియడంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై పార్టీ దృష్టి సారించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టు 1న దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలుకానుంది.

పార్టీ నిబంధనల ప్రకారం, ప్రతి సభ్యుడు ప్రతి తొమ్మిదేళ్లకు ఒకసారి తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలి. ఈ ఏడాది జరగబోయే మెంబర్‌షిప్ క్యాంపెయిన్‌లో ప్రధాని, పార్టీ అధ్యక్షుడు, పార్టీ నేతలు అందరూ తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. మొదటగా సభ్యత్వ నమోదు కార్యక్రమం సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుంది. దీని తర్వాత సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు క్రియాశీల సభ్యత్వం జరుగుతుంది. అక్టోబర్ నుంచి 1 నుండి అక్టోబర్ 15 వరకు, క్రియాశీల సభ్యత్వాలను పరిశీలన చేస్తారు.

తరువాత నవంబర్ 1-15 వరకు, బీజేపీ మండల అధ్యక్షుల కోసం ఎన్నికలు నిర్వహిస్తుంది. ఆ తర్వాత నవంబర్ 16 -30 వరకు జిల్లా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాతే డిసెంబర్‌లో రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. కనీసం 50 శాతం రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి కాగానే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే అధికారిక ప్రక్రియ మొదలవుతుంది. జేపీ నడ్డా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్ నుండి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మోడీ 3.0 క్యాబినెట్‌లో ఆరోగ్యం, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News