Amit Shah: రానున్న ఐదేళ్లలో 5వేల సైబర్ కమాండోలు.. సైబర్ సెక్యూరిటీపై అమిత్ షా ఏమన్నారంటే?
సైబర్ దాడులు(cyber-attacks) నిరోధించేందుకు అత్యున్నత అధికారుల బృందాన్ని ఏర్పరుస్తామని కేంద్రహోంమంత్రి అమిత్ షా(Amit Shah) అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: సైబర్ దాడులు(cyber-attacks) నిరోధించేందుకు అత్యున్నత అధికారుల బృందాన్ని ఏర్పరుస్తామని కేంద్రహోంమంత్రి అమిత్ షా(Amit Shah) అన్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) తొలి ఆవిర్భావ దినోత్సవంలో అమిత్ షా పాల్గొన్నారు. జాతీయ భద్రతలో సైబర్ సెక్యూరిటీ(cyber security) భాగమన్న ఆయన.. సైబర్ భద్రత లేకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదన్నారు. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు రానున్న ఐదేళ్లలో 5 వేల సైబర్ కమాండోలను శిక్షణ ద్వారా సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు. దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని.. వాటిని ఎదుర్కొనేందుకు కేంద్రప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందని తెలిపారు.
సీఎఫ్ఎంసీని జాతికి అంకితం చేసిన అమిత్ షా
దేశంలో జరుగుతున్న సైబర్ నేరాలపై పోరాడేందుకు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) నేతృత్వంలో నాలుగు ఫ్లాట్ఫామ్లను కూడా షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ (CFMC)ని కూడా ఆయన జాతికి అంకితం చేశారు. కాగా.. అక్టోబర్ 5, 2018న కేంద్ర హోంశాఖ (MHA) ఆధ్వర్యంలో సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ (CIS)లో సెంట్రల్ సెక్టార్ పథకం కింద I4Cని స్థాపించారు. దేశంలోని సైబర్ నేరాలకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా జాతీయస్థాయిలో సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటుచేయడమే దీని లక్ష్యం. సైబర్ చట్టాన్ని అమలుచేసే సంస్థల సామర్థ్యాలను మెరుగుపరచడంతో పాటు వాటాదారుల మధ్య సమన్వయం I4C తోనే సాధ్యపడుతోంది.