earthquake jolts Assam: అసోంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతగా నమోదు

అసోంలో భూప్రకంపనలు సంభవించాయి. ఉత్తర- మధ్య ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Update: 2024-10-13 06:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అసోంలో భూప్రకంపనలు సంభవించాయి. ఉత్తర- మధ్య ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. బ్రహ్మపుత్ర ఉత్తర ఒడ్డున ఉన్న ఉదల్‌గురి జిల్లాలో ఉదయం 7:47 గంటలకు భూకంపం వచ్చింది. 15 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదిక పేర్కొంది. భూకంప కేంద్రం కచ్చితమైన స్థానం గౌహతి నుండి ఉత్తరాన 105 కిలోమీటర్లు, అసోం- అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో తేజ్‌పూర్‌కు పశ్చిమాన 48 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిందంది. పొరుగున ఉన్న దర్రాంగ్, తముల్‌పూర్, సోనిత్‌పూర్, కమ్రూప్, బిస్వనాథ్ జిల్లాల్లో కూడా స్వల్పంగా ప్రకంపనలు నమోదయ్యాయి. పశ్చిమ అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు తూర్పు భూటాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించవచ్చని అధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రకంపనలు రావడంతో ప్రజలంతా ఒక్కసారిగా ఇళ్లనుంచి బయటకు వచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఇకపోతే, ఈశాన్య ప్రాంతం భూకంప జోన్‌లో ఉంది. దీనివల్ల తరచూ ఈ ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవిస్తాయి.


Similar News