Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ రెచ్చిపోయిన మిలిటెంట్లు

దిశ, నేషనల్ బ్యూరో : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతోంది.

Update: 2024-09-07 09:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతోంది. శనివారం ఉదయాన్నే జిరిబామ్ జిల్లాలోని ఓ గ్రామంలోకి కొందరు సాయుధ దుండగులు ప్రవేశించారు. వారంతా ఓ ఇంట్లోకి చొరబడి ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా తుపాకీతో కాల్చి చంపారు. కుటుంబ సభ్యుల ఎదుటే ఈ దారుణ మర్డర్ జరిగింది. దీనిపై సమాచారం అందడంతో వెంటనే పోలీసులు, భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఈక్రమంలో పోలీసులు, మిలిటెంట్ల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మిలిటెంట్లను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

గత ఐదు రోజులుగా మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని భద్రతా బలగాల స్థావరాలపై మిలిటెంట్లు డ్రోన్లతో బాంబు దాడులకు పాల్పడ్డారు. ఆ ఘటనను మర్చిపోకముందే బిష్ణుపూర్ జిల్లాలో మిలిటెంట్లు రెండు రాకెట్లతో జరిపిన దాడిలో ఒక వ్యక్తి చనిపోగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈనేపథ్యంలో కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ ఆదేశాలతో చురాచంద్‌పూర్ జిల్లా ముల్సాంగ్‌, లైకా ముల్‌సౌ గ్రామాల్లోని ఉగ్రవాదులకు చెందిన మూడు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి.


Similar News